Cyclone Freddy: మలావిలో ‘ఫ్రెడ్డీ’ బీభత్సం.. 100 మందికిపైగా మృతి

ఆఫ్రికాలోని మలావిలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో నదుల ప్రవాహం ఉద్ధృతంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated : 14 Mar 2023 08:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆఫ్రికాలోని మలావి దేశంలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి వంద మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇప్పటివరకు 60 మంది మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం. నెల వ్యవధిలో ఫ్రెడ్డీ తుపాను ఆఫ్రికాను అతలాకుతలం చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 

‘‘ఫ్రెడ్డీ తుపాను ధాటికి ఎటు చూసినా నదులు పొంగిపొర్లుతున్నాయి. నీటి ప్రవాహంలో ప్రజలు కొట్టుకుపోతున్నారు. ఎక్కడికక్కడ భవనాలు కూలిపోతున్నాయి. తుపాను ధాటికి దక్షిణ, మధ్య ఆఫ్రికాలోని ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ వర్షంతో కూడిన గాలులు తీవ్రంగా వీస్తోండడంతో దక్షిణ, మధ్య ఆఫ్రికాలో సహాయక చర్యలు చేపడుతున్న ఎమర్జెన్సీ బృందాలకు ఇబ్బందిగా మారింది. ఇక్కడ ఎక్కువగా మట్టి నివాసాలే ఉండడంతో అవి ఏ క్షణంలోనైనా కూలిపోయి ప్రజలపై పడే అవకాశం ఉంది’’ అని స్థానిక పోలీసు అధికారి పీటర్‌ ఓ వార్తా సంస్థకు తెలిపారు.

చెట్లు కూలిపోయి, కొండచరియలు విరిగిపడిన ఘటనలో గాయపడిన వారిని మాలావిలోని బ్లాంటైర్‌ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారు, గాయపడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉందని మలావి విపత్తు నిర్వహణ శాఖ ప్రతినిధి చిపిలిరో ఖములా తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో నదుల ప్రవాహం ఉద్ధృతంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని