26/11 Attack: భారత్‌కు అప్పగింత నిర్ణయాన్ని సవాల్‌ చేసిన 26/11 దాడుల నిందితుడు తహవూర్‌ రాణా

26/11 ముంబయిపై దాడుల కేసులో కీలక నిందితుడైన తహవూర్‌ రాణా అప్పగింత విషయంలో మరిన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. 

Updated : 02 Jun 2023 12:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 26/11 ముంబయి(26/11 Attack)పై దాడుల కేసులో కీలక నిందితుడైన తహవూర్‌ రాణా(62)(Tahawwur Rana)ను భారత్‌కు అప్పగింతపై మళ్లీ నీలినీడలు అలముకున్నాయి. తనను భారత్‌ అప్పగించాలన్న అమెరికా (USA) న్యాయస్థానం నిర్ణయాన్ని సవాలు చేస్తూ ది రైటాఫ్‌ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను తన అటార్నీ ద్వారా దాఖలు చేశాడు. ఈ అప్పగింత రెండు రకాలుగా అమెరికా-భారత్‌ నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని రాణా అటార్నీ సదరు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో అతడి నిర్బంధానికి, నియంత్రణకు గల కారణాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే అమెరికాలో ఈ కేసుకు సంబంధించి అపరాధిగా తేలినా లేదా నిరపరాధిగా నిరూపించినా.. అమెరికా-భారత్‌ ఒప్పందం ప్రకారం సదరు వ్యక్తిని అప్పగించడం కుదరదు. ఈ కేసులో భారత్‌ అందించిన వివరాలు ఇప్పటికే ఇల్లినాయిస్‌ న్యాయస్థానంలో జరిగిన విచారణలో ట్రాన్స్క్రిప్ట్లు,  ప్రదర్శించిన ఆధారాల నుంచి తీసుకొన్నవేనని రాణా పిటిషన్‌ పేర్కొంటోంది. ఇప్పటికే రాణాను ఇల్లినాయిస్‌ కోర్టు నిర్దోషిగా పేర్కొంది. ఈ నేపథ్యంలో రాణాను భారత్‌కు అప్పగించకూడదని కోరారు. 

26/11 ముంబయి దాడులకు సంబంధించి నిందితుల్లో ఒకడైన తహవూర్‌ రాణాను అప్పగించాలని భారత్‌ చేసిన అభ్యర్థనకు అనుకూలంగా ఇటీవల కాలిఫోర్నియా జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. భారత్‌-అమెరికా మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. పాకిస్థాన్‌ మూలాలున్న తహవూర్‌ రాణా 2008లో జరిగిన ముంబయి దాడులకు ఆర్థిక సాయం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని