NASA: ఆర్టెమిస్‌ తొలి చిత్రం: జాబిల్లి చాటున నీలిపుడమి..!

ఆర్టెమిస్‌ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తొలిసారి జాబిల్లి పై నుంచి పుడమిని ఫొటో తీసి పంపింది.

Updated : 22 Nov 2022 15:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్‌-1 యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా ఓరియన్‌ క్యాప్సుల్‌ చంద్రుడి ఉపరితలంపై 81 మైళ్ల ఎత్తులో దూసుకెళ్లి.. పెద్దకక్ష్యలోకి ప్రవేశిస్తోంది. ఇది గంటకు 5,102 మైళ్ల వేగంతో  ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో 34 నిమిషాలపాటు భూమితో సంబంధాలు తెగిపోయాయి. ఎందుకంటే చంద్రుడికి అవతలివైపు ఈ ప్రక్రియ జరగడంతో ఇలా జరిగినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఆర్టెమిస్‌-1 అనుకున్నదాని కంటే ఎక్కువ విజయం సాధించిందని నాసా వర్గాలు తెలిపాయి. అక్కడి నుంచి తీసిన చిత్రాలను ఒరియన్‌ క్యాప్సుల్‌ పంపింది. దీనిలో భూమి చిన్న నీలం చుక్కలా కనిపిస్తోంది.

నాసా డైరెక్టర్‌ జెబులున్‌ స్కోవిల్లె మాట్లాడుతూ ‘‘మీరు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న, కలలుగంటున్న రోజుల్లో ఇదొకటి. త్వరలో మానవయాత్ర కోసం సిద్ధం చేస్తున్న వాహనాన్ని తీసుకెళుతున్న క్రమంలో ఈ రోజు ఉదయం చంద్రుడి వెనుక ఉన్న భూమిని చూశాం’’ అని పేర్కొన్నారు. నాసా కూడా ఒరియన్‌ పంపిన సెల్ఫీలను ఇటీవల షేర్‌ చేసింది.  దాదాపు 50 ఏళ్ల తర్వాత తొలి స్పేస్‌ క్యాప్సుల్‌ చంద్రుడి మీదకు వెళ్లింది.

రెండునెలల పాటు వాయిదాపడిన నాసా ఆర్టెమిస్‌-1 ప్రయోగం ఎట్టకేలకు గత బుధవారం మొదలైంది. రెండు హరికేన్లు, సాంకేతిక లోపాలను దాటుకొచ్చింది. ఫ్లొరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్‌ను ప్రయోగించారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని