New Variant: కరోనాలో మరో కొత్త వేరియంట్‌.. ఇజ్రాయెల్‌లో వెలుగులోకి..!

ఈ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. మళ్లీ విరుచుకుపడుతున్నట్లే కన్పిస్తోంది. వైరస్‌ పుట్టినిల్లు చైనా సహా పలు దేశాల్లో కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయని

Updated : 17 Mar 2022 13:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. మళ్లీ విరుచుకుపడుతున్నట్లే కన్పిస్తోంది. వైరస్‌ తొలుత వ్యాపించిన చైనా సహా పలు దేశాల్లో కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కరోనాలో మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు వార్తలు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయెల్‌లో ఈ వేరియంట్‌ బయటపడినట్లు తెలుస్తోంది. 

తమ దేశంలో కరోనా కొత్త రకాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల విదేశాలకు వెళ్లి ఇజ్రాయెల్‌ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉద్ధృతంగా ఉన్న ఒమిక్రాన్‌ వెర్షన్‌లోని రెండు సబ్‌ వేరియంట్లు బీఏ.1, బీఏ.2లు కలిసి ఈ కొత్త వేరియంట్‌గా రూపాంతరం చెందినట్లు తెలిపింది. ‘‘ఈ వేరియంట్‌ గురించి ఇంకా ప్రపంచానికి తెలియదు. మా దేశంలోనే పుట్టుకొచ్చి ఉంటుందని భావిస్తున్నాం. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అంచనాలు చేయలేం. వ్యాధి తీవ్రత ఎలా ఉండనుందన్నదో తెలియాలంటే అధ్యయనం చేయాల్సి ఉంది. అయితే ఇది గత వేరియంట్లతో పోలిస్తే మరీ అంత ప్రమాదకరం కాదని, దీని వల్ల మరో దశ ఉద్ధృతి ఉండకపోవచ్చని అనుకుంటున్నాం’’ అని ఇజ్రాయెల్‌ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతవరకూ స్పందించలేదు. 

లక్షణాలివేనా..

ఈ వేరియంట్‌ బారిన పడిన ఇద్దరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జ్వరంతో పాటు కండరాల నొప్పి, తలనొప్పి వంటి మోస్తరు లక్షణాలు మినహా ప్రాణాపాయం ఏం లేదని చెప్పారు. వీరికి ప్రత్యేక చికిత్స ఏదీ అవసరం లేదని పేర్కొన్నారు. 

ఇజ్రాయెల్‌లో ఇటీవల కొత్త రకం బయటపడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో అక్కడ  ఫ్లొరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా, ఇన్‌ఫ్లూయెంజా కలవడంతో డబుల్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగా ఈ ఫ్లొరోనా వ్యాధి సోకుతున్నట్లు అధికారులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని