Taliban: బంధుప్రీతిపై తాలిబన్ల కన్నెర్ర..!

 తాలిబన్‌ పాలకులు ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల్లో బంధుప్రీతిని తొలగించాలని నిర్ణయించారు. 

Published : 21 Mar 2023 01:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాలిబన్‌(Taliban) అధికారులు తమ బంధువులను ప్రభుత్వ పోస్టుల్లో నియమించడంపై నిషేధం విధించారు. ఈ మేరకు తాలిబన్‌ (Taliban) సుప్రీం లీడర్‌  హిబైతుల్లా అఖుండ్‌జాదా ఆదేశాలు జారీ చేశారు. తాలిబన్లు 2021లో అధికారం చేపట్టిన సమయంలో చాలా మంది అధికారులను తొలగించగా.. మరికొందరు దేశం విడిచి పారిపోయారు. ఆ స్థానాల్లో కొత్తవారిని నియమించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాలిబన్‌ నేతలతో ఉన్న పరిచయాల ఆధారంగానే కొత్తవారిని నియమించినట్లు తేలింది. ఈ నియామకాలపై తాలిబన్‌ అధినేత చర్యలు చేపట్టారు. పాకిస్థాన్‌లో ఉన్న అఫ్గాన్‌ ఇస్లామిక్‌ ప్రెస్‌ తాజాగా సుప్రీం లీడర్‌ అఖుండ్‌జాదా ప్రకటన ప్రచురించింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ పదవుల్లో నియమించిన తాలిబన్‌ నేతల కుమారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ నిర్వహణలో భాగంగా పలు మంత్రిత్వశాఖల్లో తాలిబన్లకు అదనపు భాద్యతలు అప్పగించారు. వీరిలో కొందరు నగర జీవితానికి అలవాటు పడలేకపోతున్నారని అఫ్గాన్‌ కేంద్రంగా పనిచేసే అఫ్గానిస్థాన్‌ అనలిస్ట్ నెట్‌వర్క్‌  ఎన్జీవో ఇటీవల వెల్లడించిది. దీంతో వారు తమ బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు తెలుస్తోంది. నగర జీవనానికి అలవాటు పడినవారు మాత్రం విధులకు హాజరవుతున్నారు. అయితే, ఎక్కువ సమయం కార్యాలయంలో గడపాల్సి రావడం, నివేదికలు తయారు చేయడం, ఆర్థికపరమైన నిర్వహణ వంటివి వారికి కొత్తగా ఉండటంతో వారిలో కూడా కొందరు క్వైట్‌ క్విట్టింగ్‌ చేస్తున్నారట. అదే సమయంలో బంధువుల నియామకాలను కట్టడి చేయడంతో తాలిబన్‌ ప్రభుత్వంలో మరిన్ని ఖాళీలు ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని