Next Pandemic: మరో మహమ్మారికి ఇదే కారణం అవుతుందా..?

ప్రస్తుతం చోటుచేసుకుంటోన్న వాతావరణ మార్పులు తదుపరి మహమ్మారికి కారణం అవుతుండవచ్చని తాజా అధ్యయనం అంచనా వేసింది.

Published : 07 May 2022 01:38 IST

వాతావరణ మార్పులతో వైరస్‌ల ముప్పు పెరగనుందన్న అధ్యయనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో గత రెండేళ్లుగా యావత్‌ ప్రపంచం వణికిపోతూనే ఉంది. ఆ మహమ్మారి సృష్టించిన విలయానికి ప్రపంచ దేశాలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం చోటుచేసుకుంటోన్న వాతావరణ మార్పులు తదుపరి మహమ్మారికి కారణం అవుతుండవచ్చని తాజా అధ్యయనం అంచనా వేసింది. విపరీతంగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతల వల్ల అడవి జంతువులు జనావాస ప్రాంతాల్లోకి తరలి రావడం, తద్వారా వైరస్‌లు జంతువుల నుంచి మానవులకు సోకడంతో మరో మహమ్మారి ముప్పును పెంచుతున్నట్లు తాజా నివేదిక పేర్కొంది. వాతావరణ మార్పులు వైరస్‌ల సంక్రమణపై జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ఈ వివరాలు వెల్లడించింది.

‘ప్రస్తుతం మా ఆందోళన మార్కెట్లపైనే. ఎందుకంటే, అనారోగ్యకరమైన జంతువులను ఒకేచోట చేర్చడం వల్ల అత్యవసర పరిస్థితులకు కారణమ్యే ప్రమాదాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా గబ్బిలాల నుంచి మధ్యంతర జీవులకు, అక్కడనుంచి ప్రజలకు వైరస్‌ సోకే పరిస్థితులకు దారితీస్తాయ్‌’ అని జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్‌ కొలిన్‌ కార్ల్‌సన్‌ పేర్కొన్నారు. అటువంటి ప్రమాదమే వాతావరణ మార్పుల వల్ల వాస్తవరూపం దాల్చే అవకాశం ఉందన్నారు. ఎబోలా, కరోనా వంటి వైరస్‌లు కొత్త ప్రాంతాల్లో విస్తరించడానికి ఇవి అవకాశం కల్పించే ప్రమాదం ఉందన్నారు. దాంతో మూలాలను గుర్తించలేని విధంగా మారడంతోపాటు వన్యప్రాణుల నుంచి మానవులలోకి వైరస్‌లు ప్రవేశించేందుకు వాతావరణ మార్పులు కారణమవుతాయని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వేడి వాతావరణం ఉన్న కారణంగా ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలుకావచ్చన్న పరిశోధకులు.. భూతాపం తగ్గించడం వల్ల ఈ ప్రమాదాన్ని ఆపలేకపోవచ్చని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతల పెరుగుదల గబ్బిలాలపై ప్రభావం చూపించవచ్చని.. తద్వారా సుదూరు ప్రాంతాలకు తరలివెళ్లే సామర్థ్యం కారణంగా వైరస్‌ల విస్తరణ మరింత ఎక్కువగా ఉండవచ్చన్నారు. ఇలా మధ్యంతర జంతువుల మధ్య వైరస్‌లు ఎక్కువసార్లు అటూఇటూ మారినప్పుడు, అవి మానవ ఆరోగ్యంపై చూపే ప్రభావాలు ఊహించని విధంగా ఉండే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి మహమ్మారిని ముందే పసిగట్టి నివారించే మార్గాలను అన్వేషణలో ముందడుగు వేస్తున్నామని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని