Pakistan: పాకిస్థాన్‌ జనాభాలో ‘హిందువుల’ సంఖ్య ఎంతో తెలుసా..?

పాకిస్థాన్‌లో హిందువుల జనాభా ఎక్కువగానే ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 22లక్షల మంది హిందువులు ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.

Updated : 10 Jun 2022 09:41 IST

2శాతం కంటే తక్కువేనన్న తాజా నివేదిక

పెషావర్‌: దేశ విభజన అనంతరం పాకిస్థాన్‌లో హిందువుల జనాభా క్రమంగా తగ్గిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 22లక్షల మంది హిందువులు ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. పాకిస్థాన్‌లో మొత్తం నమోదిత జనాభా 18 కోట్ల 68లక్షలుగా ఉండగా వారిలో మైనారిటీ హిందువుల జనాభా 1.18శాతంగా ఉన్నట్లు సెంటర్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ పాకిస్థాన్‌ పేర్కొంది. నేషనల్‌ డేటాబేస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ అథారిటీ (NADRA) డేటా ప్రకారం, పాకిస్థాన్‌ మొత్తం జనాభాలో మైనారిటీల సంఖ్య ఐదు శాతం కంటే తక్కువే. వారిలో మైనారిటీ హిందువులే అత్యధికమని తాజా నివేదిక వెల్లడించింది.

ఎన్‌ఐడీఆర్‌ఏ నివేదిక ప్రకారం, పాకిస్థాన్‌లో 18 కోట్ల 68లక్షల జనాభా ఉండగా వారిలో 18కోట్ల 25లక్షల మంది ముస్లింలే ఉన్నారు. అక్కడ నివసిస్తోన్న వారి మతాలు, విశ్వాసాల ఆధారంగా మైనారిటీల సంఖ్యను అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 22లక్షల 10వేల (22,10,566) మంది హిందువులు ఉండగా.. 18,73,348 మంది క్రైస్తవ జనాభా ఉన్నట్లు తేలింది. అహ్మదీలు లక్షా 88వేల మంది, సిక్కులు 74వేలు, భయాస్‌ 14వేలతోపాటు మరో 3917 మంది పార్సీలు ఉన్నట్లు వెల్లడించింది. ఇక 2వేల కంటే తక్కువ జనాభా కలిగిన మైనారిటీ వర్గాలు పాకిస్థాన్‌లో 11 ఉన్నట్లు గుర్తించింది. బౌద్ధమతస్థులు 1787, చైనీయులు 1151, ఆఫ్రికన్‌ మతాలకు చెందినవారు 1418 మందితోపాటు మరికొన్ని వందల సంఖ్యలో ఇతర వర్గాలు వారు ఉన్నట్లు ఎన్‌ఐడీఆర్‌ఏ నివేదిక పేర్కొంది.

ఇదిలాఉంటే, 2శాతం కంటే తక్కువగా ఉన్న హిందువులతోపాటు అహ్మదీలు, క్రైస్తవులపై ఇటీవల వేధింపులు ఎక్కువైనట్లు నివేదికలు వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, మైనారిటీలుగా ఉన్న వారిలో దాదాపు 95శాతం మంది సింధ్‌ ప్రావిన్సులోనే జీవిస్తున్నారు. మరోవైపు పాకిస్థాన్‌ చట్టసభల్లో మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యం కూడా లేదనే చెప్పవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని