Ukrain Crisis: మేమూ మీతోనే.. దేశ రక్షణకు విదేశాల నుంచి ఉక్రెయిన్‌ ప్రవాసులు!

రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతున్న వేళ తమ దేశ సైన్యానికి అండగా నిలుస్తున్నారు ఉక్రెయిన్​ పౌరులు. దేశాన్ని రక్షించుకునేందుకు ఇప్పుడు విదేశాల్లోని వారు సైతం........

Published : 05 Mar 2022 15:58 IST

కీవ్‌: రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతున్న వేళ తమ దేశ సైన్యానికి అండగా నిలుస్తున్నారు ఉక్రెయిన్​ పౌరులు. దేశాన్ని రక్షించుకునేందుకు ఇప్పుడు విదేశాల్లోని వారు సైతం స్వదేశానికి చేరుకుంటున్నారు. రష్యాపై పోరాడేందుకు సుమారు 66,224 మంది విదేశాల్లోని ఉక్రెయిన్​ పౌరులు మాతృ దేశానికి తిరిగివచ్చినట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఒలెక్సి రెజ్నికోవ్​ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘ఈ సమయంలో తమ మాతృ దేశాన్ని దుండగుల నుండి రక్షించుకోడానికి చాలా మంది పురుషులు విదేశాల నుండి తిరిగి వచ్చారు. ఇవి మరో 12 పోరాట, ప్రేరేపిత బ్రిగేడ్‌లు! ఉక్రెయిన్‌ ప్రజలారా.. మనమింకా అజేయంగానే ఉన్నాము’ అంటూ రక్షణమంత్రి ట్వీట్‌ చేశారు.

తమపై భీకర దాడులకు దిగుతున్న రష్యా సైనికులను నిలువరించేందుకు ఉక్రెయిన్‌ అన్ని మార్గాలను వాడుకుంటోంది. విద్యార్థులు, న్యాయవాదులు, నటులు సైతం ఆయుధాలను చేతబట్టి సైనికులకు సహకరిస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకువస్తున్న ఐటీ నిపుణులు ‘డిజిటల్‌ ఆర్మీ’గా ఏర్పడి తమ వంతు కృషి చేస్తున్నారు. ఫిబ్రవరి 26న ఉక్రెయిన్‌ ఉపప్రధాని, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ శాఖ మంత్రి మైఖైలో ఫెదొరోవ్‌ స్వచ్ఛంద ‘సైబర్‌ ఆర్మీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డిజిటల్‌ రంగంలో అనేక మంది ఉక్రెనియన్లు ఉన్నారని.. వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సైబర్‌ వేదికపై దేశం తరఫున పోరాడాలని పిలుపునిచ్చారు. దీంతో లక్షలాది మంది ముందుకు వచ్చి తమవంతు సాయం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని