Pakistan: డబ్బు కోసం తిప్పలు.. అమెరికాలో రూజ్‌వెల్ట్‌ హోటల్ లీజుకిచ్చిన పాక్‌

పాకిస్థాన్(Pakistan) ఆర్థిక కష్టాలు ఇప్పట్లో తీరేలా లేదు. అందుకే దేశంతో పాటు విదేశాల్లో ఉన్న ఆస్తుల్ని తనఖా పెట్టి ఆదాయం పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Updated : 07 Jun 2023 16:03 IST

ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌(Pakistan).. ఏ చిన్న ఆదాయ మార్గాన్ని వదులుకోవడం లేదు. అందుకోసం విదేశాల్లో ఉన్న ఆస్తుల్ని తనఖా పెట్టడం.. లీజులకు ఇవ్వడం వంటివి చేస్తోంది. తాజాగా అమెరికాలోని న్యూయార్క్‌(New York) నగరంలోని ప్రముఖ రూజ్‌వెల్ట్‌ హోటల్‌(Roosevelt Hotel)ను అక్కడి స్థానిక నగరపాలక సంస్థకు మూడేళ్లపాటు లీజుకిచ్చింది. దీనిద్వారా 220 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని పొందనుంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్‌ పేరిట ఈ హోటల్‌ ప్రారంభించారు. అది 1924 నుంచి న్యూయార్క్‌లో మాన్‌హట్టన్‌లో ఒక ల్యాండ్‌మార్క్‌గా మారిపోయింది. దీనిని 1979లో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌(PIA) లీజుకు తీసుకుంది. తర్వాత కాలంలో దానిని కొనుగోలు చేసింది.

‘ఈ లీజు ఒప్పందం వల్ల పాకిస్థాన్‌ ప్రభుత్వం 220 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ఈ ఒప్పందంలో భాగంగా 1,025 గదులు న్యూయార్క్‌ యంత్రాంగానికి లభిస్తాయి. ఒక్కోదానికి 210 డాలర్ల అద్దె లభించనుంది ’అని రైల్వే, ఏవియేషన్‌ మినిస్టర్ ఖవాజా మీడియాకు వెల్లడించారు. ఈ హోటల్‌ను కరోనా మహమ్మారి కారణంగా 2020లో మూసివేశారు. వలసవచ్చిన వారికోసం ఈ ఏడాది దీనిని తిరిగి తెరిచారు.

గత కొద్దికాలంగా పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రుణాలు పెరిగిపోయి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అప్పులు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌కు 34.1 శాతం పెరిగాయి. దేశం అప్పులు మొత్తం రూ.58.6 లక్షల కోట్ల (పాకిస్థాన్‌ రూపాయలు)కు చేరినట్లు తెలిపింది. ఇందులో దేశీయ అప్పులు రూ.36.5 లక్షల కోట్లు కాగా.. విదేశీ అప్పులు రూ.22 లక్షల కోట్లు (37.6%)గా నమోదయ్యాయి. పాకిస్థాన్‌ రుణాలు ప్రతి నెలా 2.6 శాతం చొప్పున పెరుగుతున్నట్లు కథనం పేర్కొంది. 

విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. అవి నెల రోజుల దిగుమతులకు మాత్రమే సరిపోతాయని గణాంకాలను బట్టి తెలుస్తోంది. మరోపక్క ద్రవ్యోల్బణం 36.4 శాతానికి ఎగబాకింది. ఈ పరిస్థితుల మధ్య దేశం దివాళా తీయకుండా ఉండేందుకు ఐఎంఎఫ్ ప్యాకేజీని పొందేందుకు పాక్‌ చేస్తోన్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని