Pakistan: పాక్‌ నెత్తిన 18 బిలియన్‌ డాలర్ల టైమ్‌బాంబ్‌..!

అసలే డబ్బులు లేక ఆర్థిక సంక్షోభంలో విలవిల్లాడుతున్న పాక్‌(Pakistan)పై మరో బాంబు పడనుంది. ఇరాన్‌(Iran)తో చేసుకొన్న ఓ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ఏకంగా 18 బిలియన్‌ డాలర్లు ఫైన్‌గా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

Updated : 03 Mar 2023 12:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అసలే దివాలా అంచున వేలాడుతున్న పాకిస్థాన్‌(Pakistan)కు మరో భారీ షాక్‌ తగిలే అవకాశాలున్నాయి. దాదాపు 18 బిలియన్‌ డాలర్లను జరిమానా రూపంలో ఇరాన్‌కు చెల్లించాల్సి రావచ్చు. ఓ గ్యాస్‌ పైపులైన్‌ నిర్మాణం సకాలంలో పూర్తిచేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇటీవల పాకిస్థాన్‌ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ నూర్‌ ఆలమ్‌ ఖాన్‌ ఓ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించారు. గ్యాస్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ సెస్సు రూపంలో సమీకరించిన 4 బిలియన్‌ డాలర్లను వినియోగించుకోని విషయాన్ని ప్రస్తావించారు. వాస్తవానికి ఈ నిధులను ఇరాన్‌(Iran) నుంచి పైపులైన్ల ద్వారా గ్యాస్‌ దిగుమతి చేసుకోవడానికి మూడు మెగా ప్రాజెక్టులు నిర్మించేందుకు వినియోగించాల్సి ఉంది. కానీ, ఆ ప్రాజెక్టులు నిలిచిపోవడంతో నిధులు నిరుపయోగంగా పడిఉన్నాయి.

ఆంక్షలు విధించారుగా.. పెనాల్టీ మీరే కట్టండి..

ఈ పైపులైన్‌ ప్రాజెక్టు కనుక పాకిస్థాన్‌ సకాలంలో పూర్తి చేయకపోతే ఇరాన్‌కు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఇరాన్‌పై ఆంక్షలు ఉన్న సమయంలో పైపులైన్‌ నిర్మించి గ్యాస్‌ దిగుమతి చేసుకొంటే అమెరికా ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని పాక్‌ భయపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు అమెరికా మినహాయింపునిచ్చేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తికాకపోతే ఇరాన్‌ దాదాపు 18 బిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 1.4 లక్షల కోట్లు) జరిమానా విధించే అవకాశం ఉందని పాక్‌ పెట్రోలియం శాఖ కార్యదర్శి వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాము అమెరికా రాయబారితో చర్చించామని వెల్లడించారు. ప్రాజెక్టుకు అమెరికా మినహాయింపులు ఇవ్వని పక్షంలో ఇరాన్‌కు చెల్లించాల్సిన జరిమానా సొమ్మును అయినా ఇవ్వాలని కోరామన్నారు.

తాజాగా పాక్‌ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ కూడా ఇదే రకంగా స్పందించారు. విదేశాంగశాఖ అధికారులు అమెరికా రాయబారితో మాట్లాడి పరిస్థితి తీవ్రతను వివరించాలని సూచించారు. దీంతోపాటు పెట్రోలియం శాఖ ఇచ్చిన రెండు ఆప్షన్లను కూడా వివరించాలని సూచించారు. వాస్తవానికి ఈ గ్యాస్‌ ప్రాజెక్టుపై కొన్నేళ్ల క్రితమే ఇరాన్‌-పాకిస్థాన్‌ చర్చించాయి. భారత్‌ కూడా ఈ పైపులైన్‌ ప్రాజెక్టులో భాగమైంది. కానీ, ఆ తర్వాత వివిధ కారణాలతో ప్రాజెక్టు నుంచి వైదొలగింది.

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ (Pakistan) అప్పు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. రుణం ఇవ్వడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి (Imf) విధించిన షరతులకు ఇటీవలే తలొగ్గింది. రుణ వడ్డీ రేటును 17 శాతం నుంచి 19 శాతం పెంచడానికి అంగీకరించింది. దీంతో 6.5 బిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ నుంచి 1.1 బిలియన్‌ డాలర్ల అత్యవసర రుణం మంజూరుకు మార్గం సుగమమైంది. ఇలాంటి సమయంలో ఇరాన్‌కు ఏకంగా 18 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి వస్తే.. పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని