Nawaz Sharif: భారత్‌ చంద్రుడిని చేరుకుంటే.. పాకిస్థాన్‌ ప్రపంచాన్ని అడుక్కుంటోంది!

ఓవైపు భారత్‌ జీ20 సమావేశాలు జరపడం, చంద్రుడిని చేరితే.. పాకిస్థాన్‌ (Pakistan) మాత్రం ప్రపంచం ముందు అడుక్కుంటోందని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు.

Updated : 19 Sep 2023 20:26 IST

లాహోర్‌: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌పై ఆ దేశ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ (Nawaz Sharif) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైపు భారత్‌ జీ20 సమావేశాలు జరపడం, చంద్రుడిని చేరితే.. పాకిస్థాన్‌ (Pakistan) మాత్రం ప్రపంచం ముందు అడుక్కుంటోందని అన్నారు. దేశం ఇలా ఆర్థిక గందరగోళాన్ని ఎదుర్కోవడానికి ఆ దేశ మాజీ జనరళ్లు, కొందరు న్యాయమూర్తులే కారణమంటూ విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (PML) పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆయన.. పాక్‌ దీన స్థితిని ప్రస్తావించారు.

‘పాకిస్థాన్‌ ప్రధాని నేడు దేశ దేశాలు తిరుగుతూ నిధుల కోసం వేడుకుంటున్నారు. అదే భారత్‌ మాత్రం చంద్రుడిని చేరుకోవడంతోపాటు జీ20 సమావేశాలను నిర్వహించింది. భారత్‌ సాధించిన ఘనతను పాకిస్థాన్‌ ఎందుకు సాధించలేకపోయింది. దీనికి బాధ్యులు ఎవరు?’ అని లాహోర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. లండన్‌లో ఉన్న ఆయన.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.

వాజ్‌పేయీ హయాంలో..

‘అటల్‌ బిహారీ వాజ్‌పేయీ భారత ప్రధాని అయినప్పుడు.. వారి వద్ద విదేశీ మారక నిల్వలు కేవలం ఒక బిలియన్‌ డాలర్లు మాత్రమే. కానీ, ఇప్పుడు భారత్‌ విదేశీ మారకం విలువ 600 బిలియన్‌ డాలర్లు. భారత్‌ ఎక్కడకు చేరింది.. ప్రపంచం ముందు అడుక్కునే స్థితికి పాకిస్థాన్‌ ఎందుకు చేరుకుంది..? అని పార్టీ సమావేశంలో నవాజ్‌ షరీఫ్‌ ప్రశ్నించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన షరీఫ్‌.. తన ఉద్వాసన వెనక నలుగురు న్యాయమూర్తులు, అప్పటి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వాతోపాటు ఐఎస్‌ఐ చీఫ్ జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌లు ఉన్నారని ఆరోపించారు. పాకిస్థాన్‌ ఈ దుస్థితికి చేరుకోవడానికి కారణమైన ఈ అధికారులు జవాబుదారీని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే విజయం సాధిస్తుందని పాక్‌ మాజీ ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.

కెనడా-భారత్‌ ఉద్రిక్తతలు.. విద్య, వాణిజ్యంపై ప్రభావమెంత..?

ఇక అవినీతి కేసులతో జైలు శిక్ష ఎదుర్కొంటూ, అనారోగ్య కారణాలతో లండన్‌కు వెళ్లిన నవాజ్‌ షరీఫ్‌ నాలుగేళ్లుగా అక్కడే గడుపుతున్న సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లోనే తిరిగి ఆయన పాకిస్థాన్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా పాకిస్థాన్‌ రాజకీయాల్లో తిరిగి చక్రం తిప్పాలనుకున్న నవాజ్‌ షరీఫ్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన కీలక తీర్పుతో ఊహించని దెబ్బ తగిలింది. అవినీతి నిరోధక చట్టాలకు ఇటీవల చేసిన సవరణలను రద్దు చేసిన న్యాయస్థానం.. నవాజ్‌ సహా పలువురు ప్రముఖులపై అవినీతి కేసులను పునరుద్ధరించింది.

ఇదిలాఉంటే, కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న పాకిస్థాన్‌.. దాన్నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారీగా పెరుగుతోన్న ద్రవ్యోల్బణంతో పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు ఐఎంఎఫ్‌ నుంచి భారీ నిధులను కోరుతోంది. బెయిల్‌ఔట్‌ ప్యాకేజీ కింద 3బిలియన్‌ డాలర్లను విడుదల చేసేందుకు అంగీకరించగా.. జులైలో 1.2 బి.డాలర్లను పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్‌ బదిలీ చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని