Imran khan: ఇమ్రాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్తత

లాహోర్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌(imran khan) ఇంటి వద్ద రణరంగం నెలకొంది. పోలీసులు తనను అరెస్టు చేసేందుకు రావడంతో ఆయన ప్రజలకు వీడియో సందేశం విడుదల చేశారు.

Updated : 14 Mar 2023 21:06 IST

లాహోర్‌: పాకిస్థాన్‌(pakistan)మాజీ ప్రధాని, తెహ్రీక్‌ -ఏ- ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) ఇంటి వద్ద  మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవినీతి కేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను ఆయన మద్దతుదారులు అడ్డుకొంటున్నారు. ఈ క్రమంలో పోలీసులపై కొందరు రాళ్లు రువ్వగా.. ఇమ్రాన్‌ మద్దతుదారుల్ని చెరదగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు, భాష్పవాయు గోళాల్ని ప్రయోగించారు. దీంతో లాహోర్‌లోని జమన్‌ పార్క్‌లో ఇమ్రాన్‌ నివాసం వద్ద పరిస్థితులు రణరంగాన్ని తలపించాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన వీడియో సందేశాన్ని ట్విటర్‌లో పోస్ట్‌చేశారు. తాను జైలుకు వెళ్లినా, తనను చంపేసినా ప్రజలు మాత్రం తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

‘పోలీసులు నన్ను అరెస్టు చేయడానికి వచ్చారు. ఇమ్రాన్‌ ఖాన్‌ జైలుకు వెళ్తే ప్రజలు నిద్రపోతారని వారు భావిస్తున్నట్టున్నారు. అది తప్పని మీరు రుజువు చేయండి.  ప్రజలు సజీవంగా ఉన్నారని నిరూపించండి. వీధుల్లోకి వచ్చి మీ హక్కుల కోసం పోరాడండి. ఆ భగవంతుడు ఇమ్రాన్‌కు అన్నీ ఇచ్చాడు. కానీ మీ యుద్ధంలో నేనూ పోరాడుతున్నా. నేను నా జీవితమంతా పోరాడా.. దాన్ని కొనసాగిస్తాను. ఒకవేళ నాకేదైనా జరిగితే.. వాళ్లు నన్ను జైలులో పెట్టొచ్చు. చంపేయొచ్చు కూడా.  ఇమ్రాన్‌ ఖాన్‌ లేకపోయినా పోరాడగలమని మీరు నిరూపించాలి. ఒక వ్యక్తి చేసే బానిసత్వ పాలనను ఎప్పటికీ అంగీకరించబోమని మీరంతా నిరూపించాలి’’ అని పిలుపునిచ్చారు. 

ఇమ్రాన్‌ ఇంటి వద్ద డీఐజీకి గాయాలు

ఇమ్రాన్‌ ఖాన్‌ను తమ కస్టడీలోకి తీసుకొనేందుకు అధికారులు ఆయన నివాసానికి చేరుకోగా.. అప్పటికే పీటీఐ నేతలు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మద్దతుదారులు ఇమ్రాన్‌ నివాసం వద్దకు తరలివచ్చారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ కెనాన్లు, భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఆ సమయంలో పీటీఐ శ్రేణులు చేసిన దాడిలో ఇస్లామాబాద్‌ డీఐజీకి గాయాలయ్యాయి. ఇమ్రాన్‌ ఇంటివైపు వచ్చే అన్ని దారులనూ మూసివేశారు. అయితే,  ఏ కేసులో ఇమ్రాన్‌ను అరెస్టు చేసేందుకు వచ్చారనే విషయంలో మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వలేదని స్థానిక మీడియా పేర్కొంది.  ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపిస్తూ పీటీఐ నేత ఫరూక్‌ హబీబ్‌ ట్వీట్‌చేశారు.  మరో నేత ఫవాద్‌చౌదరి మాట్లాడుతూ.. తోషఖానా కేసులో అరెస్టు వారెంట్లు ను ఇస్లామాబాద్‌ కోర్టులో ఛాలెంజ్‌ చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ కేసు విచారణకు వస్తుందని పేర్కొన్నారు. మరోవైపు, పాకిస్థాన్‌ అధికార పార్టీ పీఎంఎల్‌-ఎన్‌ చీఫ్‌ ఆర్గనైజర్‌ మరియమ్‌ నవాజ్‌ షరిఫ్‌ మాట్లాడుతూ.. ఈరోజు ఎవరైనా పోలీసు అధికారి/ సిబ్బంది గాయపడితే.. అందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానిగా ఉండగా.. విదేశీ పర్యటనల్లో వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. ఈ కేసుకు సంబంధించిన మూడు సార్లు విచారణకు పిలిచినా ఇమ్రాన్‌ హాజరుకాకపోవడంతో సెషన్సు కోర్టు ఆయనపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని