Pakistan PM: పాక్‌ ప్రధాని ఆడియో క్లిప్‌ లీక్‌.. అమ్మకానికి డార్క్‌వెబ్‌లో..!

పాకిస్థాన్‌ కీలక నేతలకు చెందిన దాదాపు 115 గంటల ఆడియో క్లిప్‌ డార్క్‌ వెబ్‌లో 3.50లక్షల డాలర్లకు విక్రయానికి ఉన్నాయని ప్రతిపక్ష పీటీఐ నాయకుడు ఫవాద్‌ చౌధరీ బాంబుపేల్చారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఏమాత్రం సురక్షితం కాదని

Updated : 26 Sep 2022 13:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ కీలక నేతలకు చెందిన దాదాపు 115 గంటల ఆడియో క్లిప్‌ డార్క్‌ వెబ్‌లో 3.50లక్షల డాలర్లకు విక్రయానికి ఉందని ప్రతిపక్ష పీటీఐ నాయకుడు ఫవాద్‌ చౌధరీ బాంబుపేల్చారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఏమాత్రం సురక్షితం కాదని వెల్లడించారు. పాకిస్థాన్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు మొత్తం లండన్‌ నుంచి తీసుకొంటున్నట్లు ఈ ఆడియో క్లిప్‌లోని సంభాషణలను బట్టి అర్థమవుతుందన్నారు. నిఘా సంస్థల వైఫల్యం కారణంగానే ఇది లీకైందని పేర్కొన్నారు.

లీకైన సుదీర్ఘ ఆడియో క్లిప్‌లో పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-ఎన్‌ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్‌, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌, న్యాయశాఖ మంత్రి ఆజమ్‌ తరార్‌, ఇంటీరియర్‌ శాఖ మంత్రి రాణ సనావుల్లా, నేషనల్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ అయాజ్‌ సిద్ధీఖీ, ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సంభాషణలు ఉన్నాయి.

పాక్‌ ఆర్థిక మంత్రి మార్పుపై కీలక విషయాలు వెల్లడి..

ఈ ఆడియోక్లిప్‌ తొలి భాగంలో మరియం నవాజ్‌, ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌లు పాక్‌ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిలీ గురించి మాట్లాడుకొన్నారు. పాక్‌లో పెట్రోల్‌ ధరలు పెంచాలని కొన్నాళ్ల క్రితం ఇస్మాయిలీ నిర్ణయించారు. అప్పట్లో ఈ నిర్ణయాన్ని మరియం నవాజ్‌ తప్పుపట్టారు. ఆ తర్వాత ఆయన్ను మార్చి సీనియర్‌ నేత ఇసాక్‌ దార్‌కు ఆర్థిక శాఖ పగ్గాలు అప్పగించారు.

కానీ, తాజాగా లీకైన సంభాషణల్లో మాత్రం మరియం నవాజ్‌ స్వయంగా ఇంధన ధరలు పెంచాలని సూచిస్తున్నట్లు స్పష్టంగా ఉందని పీటీఐ నేత ఫవాద్‌ ఆరోపించారు. ఇసాక్‌దార్‌కు ఆర్థిక శాఖ ఇచ్చేందుకు కావాలని ఇస్మాయిలీపై దుష్ప్రచారం చేశారని వివరించారు.

ఈ ఆడియో లీక్‌ వ్యవహారంపై పాకిస్థాన్‌ అత్యున్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని నియమించింది. దీనిలో అన్ని ఏజెన్సీల అత్యున్నత స్థాయి అధికారులు ఉన్నారు. ప్రధాని ఇంటి భద్రతను కూడా ఈ బృందం సమీక్షిస్తుందని పాక్‌ ప్రభుత్వం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని