Pakistan: పాక్‌ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి

ద్రవ్యమారకపు రేటుపై నిబంధనలు సడలించిన తరువాత ఒక్క రోజులోనే పాకిస్థాన్‌ రూపాయి కనిష్ఠ స్థాయికి పడిపోయింది. రూ.24 మేర క్షీణించి రూ.225కి చేరింది.

Updated : 27 Jan 2023 13:01 IST

ఇస్లామాబాద్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు వీలుగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి రుణాలు పొందేందుకు పాక్‌ (Pakistan) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాజా పాకిస్థాన్‌ రూపాయి మారకపు రేటుపై నిబంధనను సరళతరం చేసింది. దీంతో డాలరుతో పాక్‌ రూపాయి మారకపు విలువ 255కి పడిపోయింది. పాక్‌ చరిత్రలో ఇంత పెద్దమొత్తంలో రూపాయి పతనం కావడం ఇదే తొలిసారి. ఐఎంఎఫ్‌ సూచన మేరకు పాకిస్థాన్‌ ద్రవ్యమారకపు రేటుపై బుధవారం నిబంధనలను సడలించింది. దీంతో ఒక్కరోజులోనే పాక్‌ రూపాయి రూ.24 మేర క్షీణించినట్లు ట్రిబ్యూన్‌ వెల్లడించింది.

రూపాయిపై పాక్‌ ప్రభుత్వం నియంత్రణలను సరళీకరించాలని, రూపాయి మారకపు విలువను మార్కెట్‌ నిర్ణయించేలా చూడాలని ఐఎంఎఫ్‌ పాకిస్థాన్‌ను కోరింది. ఐఎంఎఫ్‌ వద్ద ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 6.5 బిలియన్‌ డాలర్ల నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతుందనే ఉద్దేశంతో పాకిస్థాన్‌ వెంటనే ఈ నిబంధనకు అంగీకారం తెలిపింది. ఐఎంఎఫ్‌ నుంచి 6.5 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం తీసుకోవడానికి 2019లోనే పాకిస్థాన్‌ అంగీకరించినా, ఆ సంస్థ పెట్టిన కఠిన షరతుల వల్ల వెనకడుగు వేసింది. తాము నిధులివ్వాలంటే పాకిస్థాన్‌లో కరెంటు సబ్సిడీలను ఉపసంహరించాలనీ, అంతర్జాతీయ విపణి ధరలకు తగ్గట్టు గ్యాస్‌ ఛార్జీలను నిర్ణయించాలనీ, పాక్‌ రూపాయి మారక విలువను మార్కెట్‌ ఆధారంగా నిర్ణయించాలనీ, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్లపై నిషేధం తొలగించాలని ఐఎంఎఫ్‌ షరతులు పెట్టింది. ఇప్పుడు విడుదల చేయకపోతే ఆ నిధులన్నీ రద్దయిపోతాయి.ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ ఈ కఠిన నిర్ణయాలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

మరోవైపు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో విదేశీ మారకపు నిల్వలు పూర్తిగా పడిపోయాయి. ఒక ప్యాకెట్‌ పిండి రూ.3000 కంటే ఎక్కువ ధర పలుకుతోంది. అంత మొత్తం చెల్లించేందుకు సిద్ధపడినా.. ఆహార పదార్థాలు దొరకడం లేదు. ఇటీవల గోదుమ పిండి కోసం  పాక్‌ ప్రజలు లారీ వెంట పరుగులు తీయడం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాకుండా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో దేశం మొత్తం అంధకారంలో కూరుకుపోయింది. దేశంలో విలయం తాండవం చేస్తున్న ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు గత 24 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పాకిస్థాన్‌ సెంట్రల్‌ బ్యాంకు వడ్డీ రేట్లను కూడా అమాంతంగా పెంచేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని