Pakistan: ఇమ్రాన్‌ను సాగనంపాలి.. లేకపోతే మేం పోవాలి: పాక్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్(Pakistan)రాజకీయాలపై ఆ దేశమంత్రి రాణా సనావుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పీటీఐ పార్టీ తీవ్రంగా స్పందించింది.

Published : 27 Mar 2023 12:36 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌(Pakistan)మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan)ను ఉద్దేశించి ఆ దేశ మంత్రి రాణా సనావుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్‌ అధికార పార్టీకి శత్రువుగా మారారన్నారు. ఆయనైనా లేక తామైనా రాజకీయ రంగానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

‘ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan)ను అయినా రాజకీయాలకు దూరం చేయాలి. లేదా మేమైనా దూరం కావాలి. పీటీఐ లేదా పీఎంఎల్‌ఎన్‌( PML-N) పార్టీ.. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఉండే స్థితికి ఇమ్రాన్ దేశ రాజకీయాలను దిగజార్చారు. పీఎంఎల్ఎన్‌ ఉనికి ప్రమాదంలో ఉంది. మా పార్టీని రక్షించుకునేందుకు మేం ఎంతవరకైనా వెళ్తాం. ఇమ్రాన్‌ రాజకీయాలను శత్రుత్వంగా మార్చారు. ఆయనే ఇప్పుడు మా శత్రువు. మేం ఆయన్ను అలాగే చూస్తాం’ అని అన్నారు.

కాగా, ఈ వ్యాఖ్యలపై పీటీఐ(PTI)పార్టీ ఘాటుగా స్పందించింది. ‘అధికార సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రాణాపాయం ఉంది. వారు నేరుగా హత్య బెదిరింపులకు దిగారు. ఇమ్రాన్‌పై హత్యకు కుట్ర గురించి ఎవరికైనా అనుమానం ఉంటే.. సనావుల్లా చేసిన బెదింపులు గమనించాలి. ఒక అధికార పార్టీ ఇలా బహిరంగ బెదిరింపులకు దిగడం గతంలో ఎన్నడూ చూడలేదు’అని పీటీఐ పార్టీ నేతలు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. 

కొద్దినెలల క్రితం ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) చేపట్టిన ర్యాలీలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలన్న డిమాండ్‌తో లాంగ్‌మార్చ్‌ చేస్తోన్న సమయంలో ఇమ్రాన్‌ఖాన్‌ కంటెయినర్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు. ర్యాలీలో ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ఇమ్రాన్‌ కంటెయినర్‌ పైకి ఎక్కి నిలబడిన సమయంలో జరిపిన ఈ కాల్పుల్లో ఆయన కాలికి గాయాలయ్యాయి. తనపై జరిగిన హత్యాయత్నం వెనక రాణా సనావుల్లా ఉన్నట్లు ఇమ్రాన్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు