UK: మాకు డాక్టర్‌ సర్టిఫికెట్లు వద్దు.. యూకే వాసుల వినూత్న పోకడ..

బ్రిటన్‌ వాసులు అనారోగ్యానికి గురైనా ఆఫీస్‌లకు వెళ్లాలని భావిస్తున్నారు. దీంతో డాక్టర్లు ఇచ్చే సిక్‌నోట్‌లను తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. 

Updated : 23 Nov 2022 16:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:   ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలు వంటి అంశాలు యూకే వాసులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. వారు తీవ్ర అనారోగ్యానికి గురైనా విశ్రాంతి కోసం  డాక్టర్‌ నుంచి సిక్‌నోట్‌ (డాక్టర్‌ సర్టిఫికెట్‌)ను తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. ఈ విషయాన్ని ‘ది రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ జీపీ’ గార్డియన్‌ పత్రికకు వెల్లడించింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, గాయపడిన వారికి సిక్‌నోట్‌ చాలా కీలకం. వీటిని జనరల్‌ ప్రాక్టిషనర్లు జారీ చేస్తారు. వీటిల్లో సదరు వ్యక్తి ఎంతకాలం పని నుంచి విరామం ఉండాలో సూచిస్తారు. ‘‘నేను గతేడాది ఒకరికి సిక్‌నోట్‌ ఇచ్చాను. దానిని తీసుకోవడానికి ఆ వ్యక్తి ఇష్టపడలేదు. ‘వద్దు.. నేను పనిచేయకుండా ఉండలేను. నాకు డబ్బు అవసరం ఉంది’ అని చెప్పడం నన్ను ఆశ్చర్యపర్చింది’’ అని ది రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ జీపీ ఛైర్‌ఉమెన్‌ డాక్టర్‌ కామిలా హౌథ్రోన్‌ పేర్కొన్నారు. 

ఇటీవల కాలంలో చాల మంది తీవ్రమైన ఆయాసం, మధుమేహం, తీవ్ర అలసట, నోట్లో పుండ్లు వంటి జీవనశైలి ఆరోగ్య సమస్యలతో వస్తున్నారు. దీంతోపాటు మానసిక సమస్యలు కూడా ఉన్నాయి. వారంతా పని నుంచి విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. వారి కుటుంబాలను పోషించుకోవడానికి పనిలోకి వెళ్లడం తప్పని సరి అని వారు చెబుతున్నారని కామిలా వెల్లడించారు. ఇటువంటి వారిలో యువకులు, మధ్య వయస్కులు ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. పెరుగుతున్న వ్యయాలు యూకే దేశవాసుల ఆరోగ్యం క్షీణించడంలో కూడా ఒక కారణంగా మారుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆహారం, ఇంధన ధరలు భారంగా మారడంతో పోషకాహార లోపం ఏర్పడే పరిస్థితి నెలకొందన్నారు. 

జీవన వ్యయాల సమస్య దీర్ఘకాలంగా యూకేలో ఉందని కామిలా అభిప్రాయపడ్డారు. కానీ, కొన్ని నెలలుగా హఠాత్తుగా అది మరింత తీవ్రమైందన్నారు. రోగులకు సాయం చేయాలన్నా సాధ్యం కాని పరిస్థితి తమకు నైతికంగా భాధను కలిగిస్తోందని కామిలా పేర్కొన్నారు. 2021 ప్రారంభం నుంచి యూకేలో జీవన వ్యయం 41 ఏళ్ల గరిష్ఠానికి చేరిందన్నారు. గ్యాస్‌ ధరలు ఈ ఏడాది దాదాపు 98శాతం పెరగడం పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు