PM Modi: దిగ్గజ కంపెనీల సీఈవోలతో మోదీ, బైడెన్‌ కీలక భేటీ

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా ఇరు దేశాల్లోని టాప్‌ కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా హాజరై పలు కీలక అంశాలపై చర్చించారు.

Updated : 23 Jun 2023 23:59 IST

వాషింగ్టన్‌ డీసీ:  ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ అగ్రరాజ్యం, భారత్‌లలో టాప్‌ కంపెనీల సీఈవోలు, ఛైర్మన్లతో భేటీ అయ్యారు. శ్వేతసౌధం(White house)లో జరిగిన ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden) సైతం పాల్గొన్నారు. హైటెక్‌ హ్యాండ్‌షేక్‌ పేరిట నిర్వహించిన ఈ భేటీకి ఐటీ దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌తో పాటు నాసా ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, మహీంద్రా గ్రూపు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా,  ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెరోధా సంస్థ సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌తో పాటు పలువురు దిగ్గజ సంస్థల అధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాట్లాడుతూ.. భారత్‌-అమెరికా మధ్య సహకారం ఇరు దేశాలకే కాకుండా యావత్‌ ప్రపంచానికే ముఖ్యమైందన్నారు. ఆవిష్కరణలు, పరస్పర సహకారాలను యూఎస్‌-ఇండియా భాగస్వామ్యం కొత్త స్థాయికి తీసుకెళ్తోందన్నారు. ప్రతిభ, సాంకేతికత కలిస్తే ఉజ్వల భవిష్యత్తుకు ఎంతో భరోసా అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 

సీఈవోలతో భేటీ అనంతరం విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. భారత్‌-అమెరికా ప్రజల మధ్య స్నేహం, సహకారం మరింతగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘‘నాకు ఘన స్వాగతం పలికిన వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌, విదేశాంగ మంత్రికి ధన్యవాదాలు. మీముందుకు మరోసారి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. గత మూడురోజులుగా ఎన్నో సమావేశాల్లో పాల్గొన్నాను. భారత్‌- అమెరికా ప్రజల మధ్య స్నేహం, సహకారం మరింతగా ఉండాలని ప్రతిఒక్కరూ అభిలాషించారు. ఈ విషయాన్ని నేను గమనించాను’’ అని ప్రధాని మోదీ అన్నారు. కమలా హారిస్‌ మాట్లాడుతూ.. ‘‘అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నో దేశాలు పర్యటించాను. అయితే ప్రపంచంపై భారతదేశ ప్రభావాన్ని చూశాను. భారత్‌లో తయారైన కొవిడ్‌ వ్యాక్సిన్‌లు దక్షిణాసియాలో చాలా మంది ప్రాణాలను కాపాడాయి. ఇక ఆఫ్రికా ఖండంలో భద్రత, శ్రేయస్సు విషయంలో భారత్‌ది దీర్ఘకాల భాగస్వామ్యం ఉంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛ, బహిరంగ ప్రాంతాన్ని పోత్సహించడంలో భారత్‌ ఎంతో సహాయం చేస్తోంది’ అని అన్నారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు