PM Modi: ఉక్రెయిన్‌ యుద్ధం ‘మానవత్వ సమస్య’.. పరిష్కారానికి హామీ ఇస్తున్నా!

జీ7 సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలు ఈ ఇద్దరు నేతలు కలుసుకోవడం ఇదే మొదటిసారి.

Updated : 20 May 2023 18:06 IST

టోక్యో: జపాన్‌ (Japan)లో జరుగుతోన్న జీ7 సదస్సు (G7 Summit) క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi).. ఉక్రెయిన్‌ (Ukraine) అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy)ని కలిశారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలు ఈ ఇద్దరు నేతలు ప్రత్యక్షంగా భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌- రష్యా (Russia) వివాదాన్ని మానవత్వానికి సంబంధించిన సమస్యగా అభివర్ణించిన ప్రధాని మోదీ.. దీనికి పరిష్కారం కనుగొనేందుకు భారత్ సాధ్యమైనంత మేర కృషి చేస్తుందని జెలెన్‌స్కీకి హామీ ఇచ్చారు.

‘ఉక్రెయిన్‌ యుద్ధం మొత్తం ప్రపంచానికే పెద్ద సమస్య. అన్ని దేశాలను అనేక విధాలుగా ప్రభావితం చేసింది. కానీ, దీన్ని నేను రాజకీయ, ఆర్థిక సమస్యగా పరిగణించడం లేదు. ఇది మానవత్వం, మానవ విలువలకు సంబంధించిన సమస్య. యుద్ధ బాధలు మా అందరికంటే మీకు బాగా తెలుసు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన భారత విద్యార్థులు అక్కడి పరిస్థితులను వివరించినప్పుడు.. మీ పౌరుల వేదనను బాగా అర్థం చేసుకోగలిగా. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్‌తోపాటు వ్యక్తిగతంగానూ సాధ్యమైనంత వరకూ కృషి చేస్తానని హామీ ఇస్తున్నా’ అని మోదీ మాట్లాడారు.

ఉక్రెయిన్‌- రష్యా వివాదంపై మోదీ, జెలెన్‌స్కీలు ఇప్పటికే పలుమార్లు ఫోన్‌లో, వర్చువల్‌గా మాట్లాడిన విషయం తెలిసిందే. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారత్‌ పలుమార్లు స్పష్టం చేసింది. శాంతి ప్రయత్నాలకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉందని ఉద్ఘాటించింది. మరోవైపు జీ7 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ తదితరులను కలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు