USA: గ్యాస్ పైపులైన్‌ను ఉక్రెయిన్ మద్దతుదారులే పేల్చివేసి ఉండొచ్చు: అమెరికా

నార్డ్‌స్ట్రీమ్‌ గ్యాస్‌ పైపులైన్‌ పేల్చివేతపై అమెరికా సరికొత్త ప్రచారాన్ని వెలుగులోకి తెచ్చింది. ఉక్రెయిన్‌(Ukraine) గ్రూపులే ఈ దాడికి పాల్పడినట్లు వెల్లడించింది.

Updated : 08 Mar 2023 13:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జర్మనీ సహా ఇతర ఐరోపా దేశాలకు గ్యాస్‌ సరఫరా చేసే నార్డ్‌స్ట్రీమ్‌ పైపులైన్‌ పేల్చివేతపై అమెరికా(USA) సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. తమకు వచ్చిన ఇంటెలిజెన్స్‌ ఆధారంగా ఉక్రెయిన్‌(Ukraine) అనుకూల గ్రూపు ఈ పనిచేసి ఉండొచ్చని పేర్కొంది. అమెరికా దర్యాప్తు బృందాలు సంపాదించిన సరికొత్త ఇంటెలిజెన్స్‌ సమాచారం ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ దాడిలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ లేదా ఆయన సహాయకుల హస్తం లేదని వెల్లడించింది.

రష్యా నుంచి పశ్చిమ ఐరోపాలోని దేశాలను అనుసంధానిస్తూ నిర్మించిన నార్డ్‌స్ట్రీమ్‌ గ్యాస్‌ పైపులైన్‌పై దాడి జరిగింది. దీనికి ఏ దేశం బాధ్యత తీసుకోలేదు. ఉక్రెయిన్‌ గత కొన్నేళ్లుగా ఈ గ్యాస్‌ పైపులైన్‌ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కీవ్‌ హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వెల్లడైనా.. ఆ తర్వాత ప్రభుత్వం, సైన్యం తమకు సంబంధం లేదని వెల్లడించాయి. ఆ తర్వాత ఏకంగా అమెరికా ప్రత్యేక దళాలే ఈ గ్యాస్‌ పైపులైన్‌ను పేల్చివేశాయని.. తద్వార ఐరోపా రష్యాపై ఆధారపడే పరిస్థితి  నుంచి దూరం చేసిందని ప్రముఖ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టు సిమౌర్‌ హెర్ష్‌ కొన్నళ్ల కిందట ఓ కథనం విడుదల చేశారు. దీనిని అప్పట్లో అమెరికా ఖండించింది.

తాజాగా అమెరికా సరికొత్త ఇంటెలిజెన్స్‌ రిపోర్టులో పుతిన్‌ వ్యతిరేకులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు వెల్లడించారు. కానీ, వారెవరనే విషయాన్ని పేర్కొనలేదు. తమ వద్ద ఉన్నది ఎటువంటి ఇంటెలిజెన్స్‌ సమాచారమో వివరించేందుకు అమెరికా నిరాకరించింది. ఉక్రెయిన్‌తో సంబంధం ఉన్న పరోక్ష దళాలు దీనిలో పాల్గొన్నాయని మాత్రం వెల్లడిస్తోంది.

వాస్తవానికి ఈ గ్యాస్‌ పైపులైన్‌పై దాడి జరిగిన సమయంలో తొలుత రష్యానే ఈ పనిచేసి ఉంటుందని అమెరికా సహా పలు దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. కానీ, తాజాగా రష్యా ప్రభుత్వానికి ఈ దాడితో సంబంధం ఉందనడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని అమెరికా అధికారులు వెల్లడించారు. మరోవైపు అమెరికా లేదా బ్రిటన్‌ జాతీయులకు ఈ దాడితో ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

మాకు సంబంధం లేదు: ఉక్రెయిన్‌

నార్డ్‌స్ట్రీమ్‌ పైపులైన్‌ పేల్చివేతలో తమ అనుకూల గ్రూపు హస్తం ఉందని అమెరికా మీడియాలో విడుదలైన నివేదకలపై ఉక్రెయిన్‌ స్పందించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడి సలహాదారు దీనిపై స్పందిస్తూ ‘‘మా ప్రభుత్వంపై వచ్చే కుట్రకోణాలను తెలుసుకొవడాన్ని ఎంజాయ్‌ చేస్తాను. కానీ, ఒక్కమాట చెబుతున్నాను. బాల్టిక్‌ సముద్రంలో జరిగిన ప్రమాదంతో మాకు ఎటువంటి సంబంధ లేదు. అంతేకాదు.. వారు చెబుతున్న ఉక్రెయిన్‌ అనుకూల గ్రూపు ఏదో కూడా నాకు తెలియదు’’ అని ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని