Putin: పుతిన్ కీలక నిర్ణయం.. బెలారస్లో అణ్వాయుధాల మోహరింపు
Putin: ఐరోపా దేశాల్లో అమెరికా అణ్వస్త్రాలను మోహరించినట్లే తాము కూడా బెలారస్లో వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉంచుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.
మాస్కో: బెలారస్లో వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉంచే యోచనలో ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ (Putin) తెలిపారు. ఉక్రెయిన్పై యుద్ధం విషయంలో పాశ్చాత్య దేశాలతో రష్యాకు ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలుసార్లు పుతిన్ అణ్వస్త్ర ప్రయోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా హెచ్చరిక కూడా అందులో భాగంగానే కనిపిస్తోంది.
బెలారస్లో వ్యూహాత్మక అణ్వాయుధాలను (Tactical nuclear weapons) దాచి పెట్టే యూనిట్ల నిర్మాణం జులై 1 నాటికి పూర్తవుతుందని పుతిన్ (Putin) తెలిపారు. సంప్రదాయ ఆయుధాలు సహా అణ్వస్త్రాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న ‘ఇస్కందర్’ అనే స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థను ఇప్పటికే బెలారస్కు పంపించామని వెల్లడించారు. ఐరోపాలోని పలు దేశాల్లో నాటో కూటమి ఇప్పటికే అణ్వాయుధాలను మోహరించింది. దానికి వ్యతిరేకంగానే పుతిన్ తాజాగా ఈ చర్యలకు దిగుతున్నట్లు స్పష్టమవుతోంది.
అణ్వస్త్రాలను నియంత్రించే అధికారాన్ని మాత్రం బెలారస్కు బదిలీ చేయబోమని పుతిన్ (Putin) స్పష్టం చేశారు. అలాగే అణు నిరాయుధీకరణ నిబంధనలను కూడా ఉల్లంఘించబోమని తెలిపారు. దాదాపు ఏడాది క్రితం ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన తర్వాత రష్యా తీసుకున్న అతిముఖ్యమైన నిర్ణయాల్లో ఇదొకటి. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో దీర్ఘకాల అభ్యర్థన మేరకే తాము అణ్వాయుధాలను ఆ దేశంలో ఉంచాలని నిర్ణయించుకున్నట్లు పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్పై దాడికి బెలారస్ను స్థావరంగా వాడుకోవడానికి లుకషెంకో రష్యాకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
‘‘మేం అసాధారణమైన నిర్ణయమేమీ తీసుకోలేదు. అమెరికా ఏళ్లుగా ఈ పని (ఐరోపాలో అణ్వస్త్రాల మోహరింపు) చేస్తోంది. వాళ్లు ఐరోపాలోని ఆరు విభిన్న నాటో దేశాల్లో అణు ఆయుధాలను ఉంచారు. మేం కూడా అలాగే చేయాలని నిర్ణయించుకున్నాం. అదీ అణునిరాయుధీకరణ ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించకుండానే. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి. అలాగే వివిధ దేశాలు, ప్రజల భవిష్యత్తో ఆడుకుంటున్నాయి’’ అని పుతిన్ (Putin) అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
GHMC: హైదరాబాద్లో భారీ వర్షం.. నాలాలో పడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్యకార్మికురాలి మృతి
-
Vijay Antony: కుమార్తె లేదన్న దుఃఖాన్ని దిగమింగుకుని.. సినిమా ప్రమోషన్స్లో పాల్గొని!
-
MS Swaminathan: అధికార లాంఛనాలతో ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు: స్టాలిన్
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్కు చోటు
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్కు చేదు అనుభవం.. ప్రెస్మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో