Earthquake: శిథిలాల కింద 10 రోజుల పసికందు.. 90 గంటలు మృత్యువుతో పోరాడి గెలిచి..

తుర్కియే, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం(Earthquake)లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఆ సంఖ్య 25 వేలు దాటింది. 

Updated : 11 Feb 2023 12:55 IST

అంకారా: శిథిలాల మధ్యలో.. గడ్డకట్టే చలిలో.. ఆహారంలేని పరిస్థితుల్లో ఓ పది రోజుల పసికందు బతికి బయటపడింది. 90 గంటల పాటు జీవన్మరణ పోరాటం చేసి గెలిచింది. తుర్కియే(Turkey)లో సంభవించిన భూప్రళయం(Earthquake)లో ఈ శిశువును, అతడి తల్లిని సహాయక సిబ్బంది రక్షించారు. ఈ ఘటన హతయ్‌ ప్రావిన్సులో చోటుచేసుకుంది. 

ఆ పది రోజుల బుడతడి పేరు యాగిజ్‌ ఉలాల్‌. తన తల్లితోపాటు శిథిలాల్లో చిక్కుకున్నాడు. అయితే సహాయకచర్యలు చేపడుతున్న సిబ్బందికి సిమెంట్ బిళ్లల మధ్య నుంచి చిన్నశబ్దం వినిపించింది. వెంటనే స్పందించిన సిబ్బంది ఆ బిడ్డను వెలికితీశారు. ఆ చలిలో చిన్నారిని ఒక థర్మల్‌ దుప్పటిలో చుట్టి ఆసుపత్రికి తరలించారు. అన్ని గంటలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. ఆ చిన్నారి చురుగ్గానే ఉన్నాడు. కానీ అతడి తల్లిని మాత్రం నీరసించిన దశలో గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరికి చికిత్స అందిస్తున్నారు.

భూకంప మృతులు 25 వేలకు..

సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం(Earthquake)లో తుర్కియే(Turkey), సిరియా(Syria) దేశాల్లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. ఈ ప్రకృతి ప్రకోపంలో మరణాలు 25 వేలు దాటాయి. ఇప్పటికే 120 గంటలు దాటడంతో శిథిలాల కింది చిక్కినవారిలో ఎన్ని ప్రాణాలు నిలిచి ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. గడ్డకట్టే చలి ఉండటంతో ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. మరోవైపు ఈ రెండు దేశాలకు భారత్‌ సహా ప్రపంచ దేశాలు తమ ఆపన్నహస్తం అందిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని