Nobel Prize 2022: ఆర్థిక సంక్షోభాలపై పరిశోధన.. ముగ్గురు ఆర్థికవేత్తలకు నోబెల్‌

బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాల(Financial Crisis)పై పరిశోధనలకుగానూ బెన్‌ షాలోమ్‌ బెర్నాంకే, డాగ్లస్‌ డబ్ల్యూ. డైమండ్‌, ఫిలిప్‌ హెచ్‌.డైబ్‌విగ్‌కు సంయుక్తంగా ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం అందజేస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించింది. 

Updated : 10 Oct 2022 16:25 IST

స్టాక్‌హోం: ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి(Nobel prize 2022) ముగ్గురిని వరించింది. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాల(Financial Crisis)పై పరిశోధనలకుగానూ ప్రముఖ ఆర్థికవేత్తలు బెన్‌ షాలోమ్‌ బెర్నాంకే, డగ్లస్‌ డబ్ల్యూ. డైమండ్‌, ఫిలిప్‌ హెచ్‌.డైబ్‌విగ్‌కు సంయుక్తంగా ఈ పురస్కారం అందజేస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించింది.

ఈ ముగ్గురూ ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో బ్యాంకుల పాత్రపై కీలక పరిశోధనలు జరిపారు. బ్యాంకుల పతనాన్ని నివారించడం ఎందుకు ముఖ్యం? అనేది వారి పరిశోధనల్లో ముఖ్యాంశం. బ్యాంకులు ఎందుకు ఉన్నాయి? ఆర్థిక సంక్షోభాల సమయంలో వాటిపై తక్కువ ప్రభావం పడేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? బ్యాంకుల పతనాలు.. ఆర్థిక సంక్షోభాలకు ఏ విధంగా దారితీస్తాయి? తదితర ఆధునిక బ్యాంకింగ్ పరిశోధనలకు ఈ ముగ్గురు ఆర్థికవేత్తలు 1980ల్లోనే పునాదులు వేశారు.

ఆర్థిక మార్కెట్లను నియంత్రించడంలో, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడంలో వారి విశ్లేషణలు ఆచరణాత్మక ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. డిపాజిట్లు, డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌లు, బ్యాంకు రుణాల విషయంలో డైమండ్‌, డైబ్‌విగ్‌ పరిశోధనలు బ్యాంకులకు ఎంతో మేలు చేశాయి. పురస్కార గ్రహీతల విశ్లేషణలు.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలు, బెయిలవుట్‌లను నివారించగల సామర్థ్యాన్ని మెరుగుపరిచాయని నోబెల్‌ ప్రైజ్ కమిటీ ఛైర్మన్‌ టోర్ ఎల్లింగ్‌సెన్ చెప్పారు.

గతేడాది సైతం ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ ఇచ్చారు. అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు డేవిడ్‌ కార్డ్‌, జాషువా డి. ఆంగ్రిస్ట్‌, గైడో డబ్ల్యూ. ఇంబెన్స్‌లకు ఈ పురస్కారం దక్కడం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని