UNSCలో భారత్‌కు శాశ్వత హోదా.. మద్దతు పలికిన రష్యా

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై రష్యా తన మద్దతు ప్రకటించింది....

Updated : 25 Sep 2022 15:25 IST

ఐరాస: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై రష్యా తన మద్దతును ప్రకటించింది. ఈ హోదా పొందడానికి భారత్‌తో పాటు బ్రెజిల్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపింది. అంతర్జాతీయంగా ఈ రెండు దేశాలు చాలా కీలకమైనవని ఆ దేశ విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌ పేర్కొన్నారు. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా భద్రతామండలి కూర్పులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం ఐరాస సర్వప్రతినిధి సభనుద్దేశించి ప్రసంగించిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడం ద్వారా ఐరాస భద్రతా మండలిని మరింత ప్రజాస్వామ్యయుతంగా మార్చాల్సిన అవసరం ఉందని లావ్రోవ్‌ అన్నారు. మండలిలో తీసుకురావాల్సిన అత్యవసర మార్పులను ప్రతిపాదించడంలో భారత్‌ ముందు వరుసలో ఉంటూ వస్తోందన్నారు. ప్రస్తుతం భద్రతా మండలిలో రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్‌, అమెరికా శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. మరో 10 తాత్కాలిక శాశ్వత సభ్యదేశాలుగా వ్యవహరిస్తాయి. వీటిని ప్రతి రెండేళ్లకోసారి ఐరాస సర్వప్రతినిధి సభ ఎన్నుకుంటుంది. సమకాలీన ప్రపంచానికి సరైన ప్రాతినిధ్యం లభించాలంటే మరికొన్ని దేశాలకు శాశ్వత సభ్యత హోదాను విస్తరించాల్సిన అవసరం ఉందని గత కొన్నేళ్లుగా వివిధ దేశాల నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం భారత్‌ తాత్కాలిక శాశ్వత సభ్యదేశంగా కొనసాగుతోంది. డిసెంబరుతో గడువు ముగియనుంది. 

అయితే, దక్షిణాఫ్రికాను కూడా శాశ్వత సభ్యదేశంగా చేర్చాలన్న డిమాండ్‌ ఉంది. ఆ దేశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని లావ్రోవ్‌ను  విలేకరులు అడగ్గా.. భారత్‌, బ్రెజిల్‌ అంతర్జాతీయంగా కీలకంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. అందుకే వీటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని తాము భావిస్తున్నామన్నారు. అదే సమయంలో సభలో దక్షిణాఫ్రికా హోదాను సైతం పెంచాలని ప్రతిపాదించామన్నారు. వీటిని కాకుండా కొత్తగా పాశ్చాత్యదేశాలను మండలిలో చేర్చడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదన్నారు. ఎలాగూ పశ్చిమ దేశాలన్నీ అమెరికా విధానాలకే మద్దతుగా నిలుస్తాయి గనక వారి ప్రాతినిధ్యాన్ని పెంచడం వల్ల ఒరిగేదేమీ ఉండదని వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని