Ukraine Crisis: రష్యా యుద్ధంతో.. ఉక్రెయిన్‌కు రూ.80 లక్షల కోట్ల నష్టం!

దాదాపు ఏడు నెలలుగా రష్యాతో కొనసాగుతోన్న యుద్ధంతో.. ఉక్రెయిన్‌ ఇప్పటికే అతలాకుతలమైంది. మాస్కో సేనల దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల...

Published : 23 Sep 2022 02:29 IST

కీవ్‌: దాదాపు ఏడు నెలలుగా రష్యా(Russia)తో కొనసాగుతోన్న యుద్ధంతో.. ఉక్రెయిన్‌(Ukraine) అతలాకుతలమవుతోంది. మాస్కో సేనల దాడుల్లో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల(సుమారు రూ.80 లక్షల కోట్లు) మేర నష్టం వాటిల్లినట్లు జెలెన్‌స్కీ(Zelensky) ఆర్థిక సలహాదారు ఓలెగ్‌ ఉస్తెంకో(Oleg Ustenko) వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ(Economy)ను యుద్ధ సంక్షోభం తీవ్రంగా దెబ్బతీస్తోందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా.. ఉక్రెయిన్‌ దాదాపు ఒక ట్రిలియన్‌ డాలర్ల మేర నష్టపోయినట్లు తెలిపారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ‘జర్మన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. రష్యా దాడికి ముందు ఉన్న ఉక్రెయిన్ వార్షిక జీడీపీతో పోల్చితే.. ప్రస్తుత నష్టం విలువ అయిదు రెట్లు ఎక్కువగా ఉందని తెలిపారు.

భారీఎత్తున విధ్వంసం, ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం వంటి సమస్యలతో.. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఇబ్బందిగా మారిందని ఉస్తెంకో చెప్పారు. అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయం సైతం.. మొదట్లో ఊహించిన దాంతో పోలిస్తే గణనీయంగా పడిపోయిందన్నారు. ప్రభుత్వ వ్యయంలో భారీ కోతలు విధించినప్పటికీ.. ఫిబ్రవరి నుంచి నెలకు ఐదు బిలియన్ యూరోల(4.9 బిలియన్ డాలర్లు) లోటును ఎదుర్కొంటోందని తెలిపారు. 2023లో ఇది దాదాపు 3.5 బిలియన్ యూరోలకు తగ్గుతుందన్నారు. ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ సైతం 35 నుంచి 40 శాతం క్షీణిస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 1991లో స్వాతంత్ర్యం పొందినప్పటినుంచి ఇదే అత్యంత గడ్డుకాలమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. యుద్ధం ప్రారంభమైన మొదటి రెండు వారాల్లో.. 100 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అప్పట్లో అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని