Russia: అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధమే: రష్యా కీలక నేత హెచ్చరిక

ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకొవడం మూడో ప్రపంచ యుద్ధానికి దారీతీయవచ్చని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ డిప్యూటీ సెక్రటరీ అలెగ్జాండర్‌ వెన్డిక్టోవ్‌ గురువారం హెచ్చరించారు. ఆయన రష్యా ప్రభుత్వ రంగ వార్తా సంస్థ ‘టాస్‌ ఏజెన్సీ’తో మాట్లాడుతూ .

Published : 14 Oct 2022 01:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకొవడం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ డిప్యూటీ సెక్రటరీ అలెగ్జాండర్‌ వెన్డిక్టోవ్‌ గురువారం హెచ్చరించారు. ఆయన రష్యా ప్రభుత్వ రంగ వార్తా సంస్థ ‘టాస్‌ ఏజెన్సీ’తో మాట్లాడుతూ .. అటువంటి చర్యలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయని కీవ్‌కు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు సాయం చేసే పశ్చిమ దేశాలను యుద్ధంలో భాగస్వాములుగా పరిగణస్తామన్న విషయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. 

ఉక్రెయిన్‌ నుంచి ఆక్రమించిన నాలుగు భాగాలను రష్యాలో విలీనం చేసుకొంటున్నట్లు ఇటీవల పుతిన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాము నాటోలో చేరతామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. తమను వేగవంతంగా ఆ సైనిక కూటమిలో చేర్చుకోవాలని కోరారు. దీనికి ప్రతిస్పందనగా అలెగ్జాండర్‌ వెన్డిక్టోవ్‌ ప్రకటన వెలువడటం గమనార్హం. 

కీవ్‌పై విరుచుకుపడ్డ ఆత్మాహుతి డ్రోన్‌..

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని జనావాసాలపై గురువారం ఓ ఆత్మాహుతి డ్రోన్‌ దాడి చేసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ సైన్యం ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో గగనతల హెచ్చరిక వ్యవస్థల సైరన్లు ఆగిపోయే వరకు ప్రజలు షెల్టర్లలోనే ఉండాలని సైన్యం కోరింది. 

ఐరాస తీర్మానం తర్వాత 40 నగరాలపై దాడులు

ఉక్రెయిన్‌లోని 40 నగరాలను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులు తీవ్రం చేసింది. ఐరాసలో రష్యా వ్యతిరేక తీర్మానం ఆమోదం పొందిన తర్వాత ఈ దాడులు తీవ్రమయ్యాయి. గత 24 గంటల్లో 40 ప్రాంతాల్లో రష్యా దాడులు చేసింది. దీనికి ప్రతిగా రష్యాకు చెందిన 25 లక్ష్యాలపై 32 దాడులు చేసినట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది. రష్యా భారీగా షెల్లింగ్‌ చేస్తోందని మైకొలెవ్‌ మేయర్‌ ఒలగ్జాండర్‌ సెంకెవిచ్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ఈ దాడుల్లో ఐదంతస్తుల భవనం కూలిపోయినట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ నగరంలోని నౌకా నిర్మాణ కేంద్రం, ఓడరేవును లక్ష్యంగా చేసుకొని షెల్లింగ్‌ జరుగుతున్నట్లు వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు