Ukraine Crisis: కీలక నగరాల్లోకి అడుగుపెట్టిన రష్యా సేనలు

రష్యా సేనలు ఉక్రెయిన్లోని కీలక నగరాల్లోకి అడుగుపెట్టాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ అధికారిక వర్గాలే ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఖర్కీవ్‌,  నోవా, కఖోవ్‌కాల్లోకి ప్రవేశించాయి.

Updated : 27 Feb 2022 15:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా సేనలు ఉక్రెయిన్‌లోని కీలక నగరాల్లోకి అడుగుపెట్టాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ అధికారిక వర్గాలే ధ్రువీకరించాయి. ఖర్కీవ్‌, నోవా కఖోవ్‌కాల్లోకి ప్రవేశించాయి. ఖర్కీవ్‌లో పోరాటం జరుగుతుండగా.. నోవా కఖోవ్‌కా నగరాన్ని మాత్రం పూర్తిగా ఆధీనంలోకి తీసుకొన్నాయి. ఖర్కీవ్‌.. ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరం.  తేలికపాటి రష్యా సాయుధ వాహనాలు నగరంలోకి అడుగుపెట్టినట్లు నగర ప్రాంతీయ కార్యనిర్వాహక విభాగం అధిపతి తెలిపారు. ఈ నేపథ్యంలో షల్టర్లను వీడి బయటకు రావొద్దని ప్రజలను ఆయన హెచ్చరించారు. ఖర్కీవ్‌లోకి రష్యా సాయుధ వాహనాలు ప్రవేశించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

పారిశ్రామిక నగరం..

సోవియట్‌ సమయం నుంచి ఉక్రెయిన్‌ పారిశ్రామిక కేంద్రంగా ఖర్కీవ్‌ నిలిచింది. ఇక్కడ పలు భారీ పరిశ్రమలు ఉన్నాయి. సోవియట్‌ పతనం తర్వాత ఇక్కడ వృద్ధి స్వల్పంగా మందగించినా.. 2000 సంవత్సరం నుంచి మళ్లీ పుంజుకొంది. ప్రభుత్వ రంగానికి చెందిన  టర్బోఆటమ్‌, ఎలక్ట్రోట్యూజ్మాష్‌ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా హెవీ పవర్‌ ఎక్వీప్‌మెంట్‌ నిర్మాణంలో 17శాతం వాటా ఈ కంపెనీలకు ఉంది. 

* ప్రపంచంలో విమానాలను సొంతగా నిర్మించగల అతికొద్ది దేశాల్లో ఉక్రెయిన్‌ కూడా ఒకటి. ఇక్కడి యాంటినోవ్‌ సంస్థ వివిధ అవసరాలకు వాడుకొనే రవాణా విమానాలను తయారు చేస్తుంది. దీనికి సంబంధించిన కీలక ప్లాంట్‌ ఒకటి ఖర్కీవ్‌లో ఉంది. భారత్‌ కూడా యాంటినోవ్‌ విమానాలను వాడుకుంటోంది.

*  కీలకమైన నౌకలు, సాయుధ వాహనాలు, లోకోమోటీవ్‌ వాహనాలు, ఇంజిన్లు తయారు చేసే మలిషేవ్‌ ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది.

* ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ఐటీ హబ్‌ల్లో ఖర్కీవ్‌ ఒకటి. ఇక్కడ దాదాపు 500 కంపెనీల్లో 25వేల మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఉన్నారు. ఇక్కడి ఐటీ కంపెనీలు 800 మిలియన్‌ డాలర్లకుపైగా వ్యాపారం చేస్తాయి. ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద ఐటీ హబ్‌ ఇదే.

చమురు పైప్‌లైన్‌ పేల్చివేత..

ఖర్కీవ్‌లోని సహజవాయు పైప్‌లైన్‌ను రష్యా సేనలు పేల్చివేశాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. పర్యావరణంపై ఇది పెనుప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

నీపర్‌ నదిపై పట్టు సాధించిన రష్యా..

నోవా కఖోవ్‌కా నగరంపై పట్టు సాధించడంతో క్రిమియా ద్వీపకల్పానికి, సెవస్టపోల్ నగరానికి మంచినీరు అందించే నీపర్‌ నదిపై రష్యాకు పట్టు లభించింది. వ్యూహాత్మకంగా ఇది చాలా కీలకమైన ప్రాంతం. రష్యాలో పుట్టిన ఈ నది నుంచి సోవియట్‌ సమయంలో నిర్మించిన ఉత్తర క్రిమియా కాల్వ ద్వారా క్రిమియాకు నీటిసరఫరాను చేస్తున్నారు. కానీ, కొన్నేళ్లుగా ఉక్రెయిన్‌ నీటి సరఫరాను అడ్డుకోవడంతో క్రెమ్లిన్‌ ఆగ్రహానికి కారణంగా నిలిచింది. క్రిమియాలో తగిన నీటి వనరులు లేవు. 2014 తర్వాత కీవ్‌ నీటి సరఫరాలో సమస్యలు సృష్టించడంతో గతేడాది క్రిమియాలో కరవు పరిస్థితి నెలకొంది. దీనికి ఉక్రెయిన్‌ కారణమని రష్యా గుర్రుగా ఉంది. తాజాగా రష్యా దళాలు నగరంలోకి ప్రవేశించి ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ భవనాన్ని స్వాధీనం చేసకొన్నాయి. అక్కడ ఉన్న ఉక్రెయిన్‌ జెండాలను తొలగించాయి. ఇక ఖెర్సాన్‌, మైకోలైవ్‌, మెల్టోపోల్‌పై కూడా రష్యా దళాలు దృష్టిపెట్టాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని