Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!

సౌదీ అరేబియా(Saudi Arabia)లో రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తోంది. దాంతో అక్కడ ఎన్నడూ లేని విధంగా మరణశిక్షల సంఖ్య పెరిగింది.

Published : 03 Feb 2023 02:25 IST

రియాద్‌: అరబ్‌ దేశం సౌదీ అరేబియా(Saudi Arabia)లో రికార్డు స్థాయిలో మరణ శిక్షలు అమలవుతున్నాయి. తమ ప్రభుత్వం మరణ శిక్షలను వీలైనంత వరకు తగ్గిస్తుందని యువరాజు మహ్మద్‌ బిన్ సల్మాన్(Mohammed bin Salman) గతంలో చేసిన ప్రకటనకు విరుద్ధంగా అక్కడ వాస్తవ పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ మరణశిక్షలు విధిస్తున్నారు. గత ఆరేళ్లలో వీటి సంఖ్య గణనీయంగా పెరిగిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 

2015 నుంచి 2022 మధ్యలో ఏడాదికి సగటున 129 మరణ శిక్షలు అమలయ్యాయి. 2010-14తో పోలిస్తే 82 శాతం పెరిగాయి. ఒక్క గత ఏడాదే 147మందికి ఈ శిక్షలు విధించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులు ఇందులో ప్రధాన బాధితులని తెలిపాయి. అరబ్‌ దేశాల్లో తప్పు చేసిన వారికి విధించే శిక్షలు ఎంతో కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మాదకద్రవ్యాలు, ఆత్యాచారం, ఉగ్రవాదం వంటి నేరాల్లో దోషులుగా తేలిన వారికి బహిరంగంగా మరణ శిక్షను అమలు చేస్తారు. శిరచ్ఛేదాన్ని కూడా అమలు చేస్తారు. 

ఇక సల్మాన్‌పై ఖషోగీ హత్య మరక తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. టర్కీలోని ఇస్తాంబుల్‌లో గల సౌదీ అరేబియా దౌత్యకార్యాలయంలో 2018 అక్టోబరు 2న వాషింగ్టన్‌ పోస్ట్‌ కాలమిస్టు జమాల్‌ ఖషోగీ(Jamal Khashoggi) దారుణ హత్యకు గురయ్యాడు. సౌదీ రాజకుటుంబాన్ని, అక్కడి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించే ఖషోగీ.. ఆ దేశ కాన్సులేట్‌లోనే హత్యకు గురవడంతో సౌదీ యువరాజుపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని