Shinzo Abe: క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియల కంటే.. షింజో అబె వీడ్కోలుకు అధిక ఖర్చు!

జపాన్ మాజీ ప్రధాని షింజో అబె తుది వీడ్కోలు కార్యక్రమంలో ఈనెల 27 తేదీన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని హంగులతో జరిపేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది..........

Updated : 25 Sep 2022 03:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్ మాజీ ప్రధాని షింజో అబె తుది వీడ్కోలు కార్యక్రమం ఈనెల 27 తేదీన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని హంగులతో జరిపేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఇందుకు సంబంధించిన ఓ విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సంస్మరణ సభకు అనేక ఏర్పాట్లు చేస్తూ, భారీగా ఖర్చు చేస్తోందని.. వీడ్కోలు కార్యక్రమం కోసం ఏకంగా 1.66 బిలియన్ల యెన్‌లను ఖర్చు చేస్తున్నారని అక్కడి మీడియా పేర్కొంటోంది. ఇది ఈమధ్యే ముగిసిన బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 అంత్యక్రియలకు అయిన ఖర్చు కంటే అధికం. ఎలిజబెత్‌ అంత్యక్రియలకు దాదాపు 1.3 బిలియన్ల యెన్‌లు ఖర్చుచేసినట్లు సమాచారం.

అబె సంస్మరణ సభ నిర్వహించే కాంట్రాక్ట్‌ను టోక్యోకు చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ మురయామాకు అప్పగించారు. అయితే, ప్రభుత్వం ఎందుకు అంత ఖర్చు చేస్తోందంటూ ఈ కార్యక్రమాన్ని చాలా మంది జపనీయులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సభపై నిరసన తెలుపుతూ ప్రధాని ఫుమియో కిషిడా కార్యాలయం సమీపంలో ఓ వ్యక్తి నిప్పంటించుకున్నాడు. ‘ది గార్డియన్’ నివేదిక ప్రకారం.. సంస్మరణ సభ అంచనా వ్యయం 250 మిలియన్ యెన్‌లుగా జపాన్ ప్రభుత్వం మొదట పేర్కొంది. ఇదిలా ఉంటే, ముఖ్య క్యాబినెట్ సెక్రటరీ హిరోకాజు మాట్సునో ప్రకారం.. ఈవెంట్ పోలీసింగ్ కోసం దాదాపు 800 మిలియన్ యెన్‌లు ఖర్చవుతాయని అంచనా వేయగా, ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చేందుకు 600 మిలియన్ యెన్‌లు ఖర్చుకానున్నట్లు అంచనా వేశారు. ఈ బిల్లు మొత్తంగా 1.7 బిలియన్ యెన్‌లకు చేరుకోవచ్చని ఆయన వెల్లడించారు.

జపాన్‌ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన అబె.. జులైలో హత్యకు గురయ్యారు. నరా నగరంలోని ఓ వీధిలో లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో అబె వేదికపైనే కుప్పకూలారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు కూడా ముగిశాయి. కానీ అక్కడి ప్రభుత్వం సెప్టెంబర్ 27న అధికారిక వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌ నిర్వహిస్తోన్న రెండో అధికారిక వీడ్కోలు కార్యక్రమమిది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని