Pakistan: మూడువారాలకే నిల్వలు.. పాక్లో నూనె, నెయ్యికి తీవ్ర కొరత
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థానీవాసులను వంటనూనె ధరలు మరింత భయపెడుతున్నాయి. దిగుమతులు లేక నూనె, నెయ్యి నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వీటి ధరలు కొండెక్కే అవకాశముంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దాయాది పాకిస్థాన్ (Pakistan) పరిస్థితి నానాటికీ మరింత దిగజారుతోంది. ఇప్పటికే చికెన్, గోధుమ పిండి ధరలు కొండెక్కగా.. తాజాగా మరిన్ని నిత్యావసరాల కొరత ఏర్పడింది. దిగుమతులు లేక.. వంటనూనె (Cooking Oil), నెయ్యి (Ghee) సరఫరాలు పడిపోయాయి. మరికొద్ది నెలల్లో రంజాన్ మాసం ప్రారంభం కానున్న వేళ.. సరఫరా పెంచకపోతే వీటి ధరలు మరింత పెరిగే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పాకిస్థానీలు వినియోగించే 90శాతం వంట నూనెకు దిగుమతులే ఆధారం. అయితే నిధుల కొరత కారణంగా వంటనూనెను దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది. వంటనూనె (Edible Oil)ను ‘అత్యవసర వస్తువుల’ జాబితాను తొలగిస్తున్నట్లు దేశంలోని కమర్షియల్ బ్యాంకులు.. దిగుమతులదారులకు సమాచారమిచ్చాయి. కస్టమ్స్ గోదాముల్లో 3,58,000 టన్నుల వంటనూనె ఉన్నప్పటికీ.. దాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు బ్యాంకులు లెటర్ ఆఫ్ క్రెడిట్స్, రిటైరింగ్ పత్రాలను క్లియర్ చేయట్లేదు. దీంతో దిగుమతి నిల్వలపై సర్ఛార్జ్, ఇతర రుసుములు పెరుగుతున్నాయి. మరోవైపు పాకిస్థానీ రూపాయి విలువ డాలర్ మారకంతో పోలిస్తే రోజురోజకీ క్షీణిస్తోంది. దీంతో దిగమతులు మరింత భారమవుతున్నాయి.
డిమాండ్కు సరిపడా సరఫరా లేక వంటనూనె, నెయ్యి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే వీటి ధరలు లీటర్పై రూ.26 పెరిగాయి. బ్యాంకులు లెటర్ ఆఫ్ క్రెడిట్స్ జారీ చేయకపోతే.. రాబోయే రోజుల్లో వీటి ధరలు లీటర్పై మరో రూ.15-20 పెరగొచ్చని వంటనూనె తయారీ, సరఫరాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమున్న స్టాక్ మరో మూడు నాలుగు వారాలకు మాత్రమే సరిపోతుంది. ఈలోగా దిగుమతులు క్లియర్ కాకపోతే ధరల మోత తప్పేలా కన్పించట్లేదని చెబుతున్నారు. మార్చి మూడో వారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఆ సమయంలో నూనె, నెయ్యికి 20-25శాతం అధిక డిమాండ్ ఉంటుంది. ఆలోగా సమస్యను పరిష్కరించాలని సరఫరాదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
చాలాకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ (Pakistan)ను గతేడాది వచ్చిన వరదలు మరింత దెబ్బకొట్టాయి. భారీ వరదలకు దేశంలో మూడోవంతు మునిగిపోయింది. దీనివల్ల ఎగుమతులు తగ్గి, ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎగుమతులు తగ్గటంతో విదేశీమారక నిల్వలు పడిపోయాయి. ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద విదేశీమారక నిల్వలు(5.5 బిలియన్ డాలర్లు) 3 నెలల దిగుమతులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఖర్చులు తగ్గించుకునేందుకు ఆ దేశం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. ఇంధన పొదుపు కోసమని ప్రస్తుతం పాక్వ్యాప్తంగా విద్యుత్ వాడకంపై ఆంక్షలు విధించారు. దేశంలో సగం వీధిలైట్లను ఆపేశారు. అమెరికాలోని తమ పాత రాయబార కార్యాలయాలను కూడా అమ్మేసే స్థితికి పరిస్థితి దిగజారడం దయనీయకరం..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!