Mummified Body: తల్లి మృతదేహాన్ని భద్రపరచి.. 13ఏళ్లుగా సోఫాలోనే ఉంచి..!

పోలండ్‌లో (Poland) దారుణం వెలుగు చూసింది. చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ఓ వ్యక్తి 13 ఏళ్లుగా అక్కడే జీవిస్తున్న ఘటన ఇటీవల బయటపడింది.

Published : 29 Mar 2023 19:27 IST

వార్సా: పోలండ్‌లో (Poland) విస్తుపోయే విషయం వెలుగు చూసింది. చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ఓ వ్యక్తి ఏళ్లపాటు జీవిస్తున్న ఘటన ఇటీవల బయటపడింది. అయితే, మృతదేహం పాడవకుండా ప్రత్యేకంగా భద్రపరచి (Mummified Corpse) ఇంట్లో సోఫాలోనే ఉంచడం గమనార్హం. అలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 13ఏళ్లుగా మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని నివసిస్తున్న ఘటన అక్కడివారిని భయభ్రాంతులకు గురిచేసింది.

పోలండ్‌ రాడ్లిన్‌లోని రోగోజినా వీధిలో మరియన్‌ ఎల్‌ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతడి ఇంటికి ఇటీవల (ఫిబ్రవరి 22న) ఆయన బంధువు ఒకరు వచ్చారు. ఆ సమయంలో మరియన్‌ విచిత్ర చూపులు చూస్తు ఇంటిబయట తిరుగుతున్నట్లు గమనించాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన ఆయన..  వెంటనే ఇంట్లోకి వెళ్లి గాలించాడు. అక్కడున్న ఓ సోఫా మీద వార్తాపత్రిక కట్టలపై ఓ మృతదేహాన్ని (Mummified Body) ఉన్నట్లు గుర్తించాడు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. ఆ వార్తాపత్రికలు కూడా 2009 సంవత్సరం నుంచి ఉన్నట్లు గుర్తించారు.

ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఆ ఇంటికి వెళ్లిన అధికారులు అక్కడున్న మృతదేహాన్ని చూసి అవాక్కయ్యారు. గతంలో మరణించిన అతడి తల్లి మృతదేహం అయి ఉండవచ్చని అనుమానించారు. 2010 జనవరిలో చనిపోయిన అతడి తల్లి ఖననం చేసిన ప్రదేశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. అనంతరం సమీపంలోనే ఉన్న శ్మశానవాటిలోని అతడి తల్లి శవపేటికను తెరచిచూడగా అది ఖాళీగా కనిపించింది. దీంతో అంత్యక్రియల అనంతరం ఆమెను పూడ్చిపెట్టిన కొన్ని గంటలకే దాన్ని తవ్వి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చాడని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. రసాయనాలతో భద్రపరచడం వల్ల ఇన్నేళ్లయినా ఆ మృతదేహం ఏమాత్రం కుళ్లిపోలేదట. అయితే, మృతదేహాన్ని ఖననం చేయకుండా ఉంచిన అభియోగాలపై మరియన్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. అతడి మానసిక పరిస్థితిని పరిశీలించేందుకు వైద్యుల సహాయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని