Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన

శ్రీలంకలో 2019 నాటి బాంబు దాడుల ఘటనపై అప్పటి దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తాజాగా క్షమాపణలు చెప్పారు. దీంతోపాటు 2024లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. 

Published : 01 Feb 2023 01:53 IST

కొలంబో: దేశాన్ని కుదిపేసిన ఈస్టర్‌ బాంబు దాడుల(Easter Bombings) ఘటనపై శ్రీలంక(Sri Lanka) మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన(Maithripala Sirisena) తాజాగా దేశ క్యాథలిక్‌ సమాజానికి క్షమాపణలు చెప్పారు. దీంతోపాటు 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. ఐసిస్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు 2019 ఏప్రిల్‌లో ఇక్కడి మూడు ప్రార్థనా మందిరాలతోపాటు అనేక హోటళ్లలో వరుస ఆత్మాహుతి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో దాదాపు 270 మంది మృతిచెందారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ముందస్తు నిఘా సమాచారం ఉన్నప్పటికీ.. దాడులను నిర్మూలించలేకపోయారని అప్పటి అధ్యక్షుడు సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘేలపై విమర్శలు వెల్లువెత్తాయి.

తాజాగా ‘శ్రీలంక ఫ్రీడం పార్టీ’ నేతల సమావేశంలో సిరిసేన మాట్లాడుతూ.. ఇతరులు చేసిన పనికి తాను క్యాథలిక్ సమాజానికి క్షమాపణలు చెబుతున్నానన్నారు. ఇదే వ్యవహారంలో శ్రీలంక సుప్రీం కోర్టు.. సిరిసేనకు ఇటీవల భారీ జరిమానా విధించిన వేళ ఈ వ్యాఖ్యలు వచ్చాయి. రూ.2.2 కోట్ల(2.73 లక్షల డాలర్లు) జరిమానాను తన వ్యక్తిగత ఖాతా నుంచి చెల్లించాలని సుప్రీంకోర్టు ఆయన్ను ఆదేశించింది. అయితే, దాడులను నివారించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ వేసిన ఓ కేసులో సిరిసేన నిర్దోషిగా తేలారు. దీనిపై శ్రీలంక క్యాథలిక్ చర్చి ఆర్చ్‌బిషప్‌ మాల్కం రంజిత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్యాప్తు కప్పిపుచ్చినట్లు ఆరోపించారు. సిరిసేన మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. తాజాగా క్షమాపణలు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని