Rishi Sunak: లావ్రోవ్‌ ఎదురుగానే రష్యాపై నిప్పులు చెరిగిన సునాక్‌..!

జి-20 సదస్సులో భాగంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్..రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై జరుపుతోన్న యుద్ధాన్ని వెంటనే ముగించాలని వ్యాఖ్యానించారు.

Published : 16 Nov 2022 01:54 IST

బాలి: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దాడిని అమెరికా, దాని మిత్రదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా ఇండోనేషియాలో జరుగుతోన్న జి-20 సదస్సులో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌.. రష్యాపై విమర్శలు చేశారు. ఏ దేశమైనా తమ పొరుగు దేశంపై దాడి చేయకూడదని వ్యాఖ్యానించారు. ‘ఉక్రెయిన్‌ నుంచి మాస్కో బయటకు రావాలి. ఈ అనాగరిక యుద్ధాన్ని ముగించాలి’ అని రష్యా వైఖరిని తప్పుపట్టారు. అలాగే ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ సమావేశానికి గైర్హాజరుకావడంపై విమర్శలు చేశారు. ‘ఆయన వచ్చి ఉంటే.. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించేవాళ్లం’ అని అన్నారు. 

సునాక్ మాట్లాడుతున్న సమయంలో అదే ప్లీనరీ హాల్‌లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఉన్నారు. ఆయన ఎదురుగానే బ్రిటన్ ప్రధాని తన దేశ వైఖరిని స్పష్టం చేశారు. యుద్ధం మొదలైన దగ్గరి నుంచి బ్రిటన్‌ ప్రధాని.. రష్యా ఉన్నతస్థాయి నేతతో ఎదురుపడి మాట్లాడడం ఇదే మొదటిసారి. కాగా, ఉక్రెయిన్‌ చర్చలకు సముఖంగా లేకపోవడంతో..యుద్ధం విషయంలో ఒక ఒప్పందానికి రావడం క్లిష్టంగా మారిందని లావ్రోవ్ అన్నారు. జి-20 సమావేశంలో భాగంగా విలేకరులతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌ వైఖరిని నిందించారు. 

యుద్ధం ఆపేందుకు సమయం వచ్చింది: జెలెన్‌స్కీ

రష్యా చేస్తోన్న విధ్వంసక యుద్ధాన్ని ఆపేందుకు, వేల మంది ప్రాణాలు కాపాడేందుకు ఇప్పుడు సమయం వచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. ఆయన ఈ సదస్సులో భాగంగా వర్చువల్‌గా ప్రసంగించారు. అలాగే అణు బెదిరింపులను ఏవిధంగానూ సహించకూడదన్నారు. ఈ సందర్భంగా జి-20 నుంచి రష్యాను పక్కనపెట్టి జి-19 అని ప్రస్తావించడం గమనార్హం.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని