Taliban and China: చైనాకు చమురు కావాలి.. తాలిబన్లకు నిధులు కావాలి..!

తాలిబన్లు తొలిసారి అంతర్జాతీయ డీల్‌ కుదుర్చుకున్నారు. చైనా సహకారంతో ఇది సాధ్యమైంది. 

Published : 06 Jan 2023 12:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాలిబన్లు తొలిసారి ఓ అంతర్జాతీయ ఒప్పందం చేసుకున్నారు. అసలు తాలిబన్లను గుర్తించడానికే ప్రపంచదేశాలు ఇష్టపడని సమయంలో చైనా సాయంతోనే ఇది సాధ్యమైంది. అఫ్గానిస్థాన్‌ భూభాగంలో నిక్షిప్తమైన ట్రిలియన్‌ డాలర్ల విలువైన ఖనిజాలపై చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. వాటిని వెలికి తీయడానికి తాజాగా తొలి అడుగు వేసింది. చైనాకు చెందిన షింజియాంగ్‌ సెంట్రల్‌ ఏషియా పెట్రోలియం అండ్‌ గ్యాస్‌ కంపెనీతో నిన్న150 మిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందాన్ని చేసుకొంది. దీని ప్రకారం అము నదీ పరీవాహక ప్రాంతంలో చైనా కంపెనీ చమురును వెలికి తీయనుంది. ఈ డీల్‌ ద్వారా నాలుగు వేల చదరపు కిలో మీటర్ల పరిధిలో చమురు అన్వేషణ, వెలికితీత జరుగుతాయి. దాదాపు 3,000 మంది అఫ్గాన్‌ వాసులకు ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. ఈ ఒప్పందం కింద చేపట్టే చమురు ప్రాజెక్టులో తాలిబన్లకు 20శాతం వాటా లభిస్తుంది. దీనిని 75శాతం వరకు పెంచుకొనే అవకాశం ఉంది.

ఈ ఒప్పందంపై తాలిబన్‌ షాబుద్దీన్‌ దిలావర్‌ మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో చైనా నుంచి 540 మిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడుల రూపంలో రావొచ్చని అంచనా వేస్తున్నాట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందంపై చైనా రాయబారి వాంగ్‌ మాట్లాడుతూ భవిష్యత్తులో అఫ్గానిస్థాన్‌తో ద్వైపాక్షిక అభివృద్ధికి ఇది శుభారంభం అని తెలిపారు. అఫ్గాన్‌ చట్టాలను పూర్తిగా పాటించాలని ఈ సందర్భంగా చైనా కంపెనీకి ఆయన సూచించారు. కాంట్రాక్టుకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలన్నారు. గతంలో పౌర ప్రభుత్వం ఉన్న సమయంలో అము దరియా బేసిన్‌లో చమురు ఉత్పత్తిపై ఒక అఫ్గాన్‌ కంపెనీతో చైనా ప్రభుత్వ రంగ పెట్రోలియం కార్పొరేషన్‌ సంతకం చేసింది. కానీ, తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందాన్ని రద్దు చేసినట్లు తాజాగా ప్రకటించారు. కొత్త ఒప్పందం కింద వెలికి తీసిన చమురును అఫ్గానిస్థాన్‌లోనే ప్రాసెసింగ్‌ చేస్తారు. చైనాలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ కంపెనీ తాలిబన్లతో ఒప్పందం చేసుకొనే సాహసం చేయదన్న విషయం తెలిసిందే.

గతేడాది ఆగస్టులో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత అంతర్జాతీయ సమాజం నుంచి మాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. చైనా కూడా తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. కానీ, వారితో కలిసి సన్నిహితంగా పనిచేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని