Unicef: పాఠశాలలు తెరిచే ఉంచండి: యునిసెఫ్‌

ఒమిక్రాన్‌ రూపంలో కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో పలు దేశాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయి. అయితే, ఇది ప్రపంచవ్యాప్తంగా 61.6కోట్లకుపైగా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోందని యునైటెడ్‌ నేషన్స్‌ చిల్డ్రన్స్‌ ఫండ్‌(యునిసెఫ్‌) ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా నిబంధనలను

Published : 29 Jan 2022 02:01 IST

వాషింగ్టన్‌: ఒమిక్రాన్‌ రూపంలో కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో పలు దేశాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయి. అయితే, దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా 61.6 కోట్లకుపైగా విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోందని యునైటెడ్‌ నేషన్స్‌ చిల్డ్రన్స్‌ ఫండ్‌ (యునిసెఫ్‌) ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ పాఠశాలలను తెరిచే ఉంచాలని యునిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్రిట్టా ఫోర్‌ ప్రపంచ దేశాలకు సూచించారు. 

‘డిజిటల్‌ కనెక్టివిటీపై పెట్టుబడులు పెడితే.. విద్యార్థులందరికీ ఆన్‌లైన్‌ చదువులు అందుతాయని తెలుసు. కానీ, ప్రతి విద్యార్థి పాఠశాలకు తిరిగి వచ్చేలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం. పాఠశాలకు వస్తేనే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టగలం. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించవచ్చు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మధ్యాహ్న భోజనం వంటి పథకాలతో విద్యార్థులకు పోషకాలు అందేలా చేయొచ్చు. విద్యార్థుల మౌలిక అవసరాలను తీర్చే వీలుంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా బోధన, బోధనేతర సిబ్బందికి ప్రాధాన్యమిచ్చి వెంటనే వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి’’ అని హెన్రిట్టా చెప్పారు. 

విద్యార్థులకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే.. వాటి పంపిణీలో యునిసెఫ్‌ మద్దతుగా ఉంటుందని, అయితే, పెద్దలందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ అవసరం ఉండకపోవచ్చని హెన్రిట్టా అభిప్రాయపడ్డారు. ‘‘ఒకవేళ విద్యార్థులకి వ్యాక్సినేషన్‌ తప్పనిసరి చేస్తే వ్యాక్సిన్‌ వేసుకొని విద్యార్థులు పాఠశాలలో ప్రవేశానికి అనర్హులవుతారు. దీనివల్ల అసమానతలు ఏర్పడతాయి. అందుకే, డబ్ల్యూహెచ్‌వో సిఫార్సులకు అనుగుణంగా చర్యలు చేపట్టి పాఠశాలలను తెరిచి ఉంచాలని యునిసెఫ్‌ సూచిస్తోంది. విద్యావ్యవస్థకు కొవిడ్‌ మహమ్మారి విసురుతున్న సవాళ్లను మేం గుర్తించాం. కానీ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారిని పాఠశాలకు పంపడానికి మనమంతా సమష్టిగా కృషి చేయాలి’’ అని హెన్రిట్టా పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని