COVID Vaccination: ఈ దేశాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరి.. అవేంటో తెలుసా?

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గినట్టే కనిపించి ఒమిక్రాన్‌ ప్రభావంతో మళ్లీ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌తో పాటు .........

Updated : 18 Jan 2022 21:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గినట్టే కనిపించినప్పటికీ ఒమిక్రాన్‌ ప్రభావంతో మళ్లీ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి వ్యాక్సిన్‌, మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడమే మన వద్ద ఉన్న అస్త్రాలు. మన దేశంలోనూ గత కొన్ని వారాలుగా కొవిడ్‌ కేసులు లక్షల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వ్యాక్సినేషన్‌ అంశంపై జనవరి 13న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కీలక అఫిడవిట్‌ దాఖలు చేసింది. దేశంలో ఎక్కడా బలవంతంగా టీకా కార్యక్రమం జరగడంలేదని తెలిపింది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం తప్ప తప్పనిసరిగా టీకా వేసుకోవాలన్న నిబంధన ఏమీ లేదని సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. టీకా వేసుకోవాల్సిందేనంటూ ఎవరినీ బలవంతపెట్టడం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. అయితే, ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రం తమ ప్రజలకు కొవిడ్‌ టీకాలను తప్పనిసరి చేశాయి. ఆ దేశాలేంటో ఓసారి చూద్దామా?

ఆస్ట్రియా: ఫిబ్రవరి నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్‌ తప్పనిసరి చేసింది. గర్భిణులకు మాత్రం వైద్యపరమైన కారణాల రీత్యా మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొంది. 

ఫ్రాన్స్‌: ఇంకా టీకా వేయించుకోని వ్యక్తులు రెస్టారెంట్లు, బార్‌లు, ఇతర ప్రదేశాల్లోకి ప్రవేశించడాన్ని నిరోధించే బిల్లును ఆదివారం ఆ దేశ పార్లమెంట్‌ ఆమోదించింది.  ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత ఫ్రాన్స్‌లో టీకాలు వేయించుకోని వ్యక్తులు తాము టీకా వేయించుకున్నట్టు వ్యాక్సిన్‌ పాస్‌ లేదా కొన్ని ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా పలు నగరాల్లో ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

జర్మనీ: జర్మనీ ప్రభుత్వం ఇంకా అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు. కాకపోతే ఇటీవల జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌ ఇటీవల పార్లమెంట్‌ వేదికగా చేసిన ప్రసంగం.. ఆ దేశంలో 18 ఏళ్లు దాటిన అందరూ వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేసుకోవాల్సిందేనన్న వాదనను సమర్థించేలా కనబడుతోంది.

ఇటలీ: ఇప్పటికే ఉపాధ్యాయులు, హెల్త్‌కేర్‌ సిబ్బదికి టీకాను తప్పనిసరి చేసింది. అలాగే, 50 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాల్సిందేనని ఈ జనవరిలోనే స్పష్టంచేసింది. ఉద్యోగులు పని ప్రదేశాలకు వెళ్లాలంటే అప్పటికే టీకా వేసుకోవడమో లేదా కొవిడ్ నెగిటివ్‌ పత్రం చూపించాల్సి ఉండటమో గతేడాది అక్టోబర్‌ నుంచి అమలవుతూ వస్తోంది.

మొరాకో: బార్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశించాలంటే ప్రజలు టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే యూకేలో ఇప్పటివరకైతే ఆరోగ్య, సామాజిక సంరక్షణ కార్యకర్తలకు మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకోవడం అవసరమని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని