Genetic condition: ఎంత తిన్నా తీరని ఆకలి.. పదేళ్ల బాలుడికి అరుదైన వ్యాధి

ఓ బాలుడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఎంత తిన్నా కడుపు నిండకపోవడం, ఆకలి తీరకపోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం.......

Published : 09 Mar 2022 18:16 IST


ప్రతీకాత్మక చిత్రం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కడుపు నిండా పౌష్టికాహారం తిన్నా.. ఆకలి ఏమాత్రం తీరకుండా, ఇంకా ఏదో తినాలని అనిపిస్తే ఎలా ఉంటుంది..? అలాంటి ఆలోచన అరగంట, గంట కాదు.. రోజంతా ఉంటే..? సింగపూర్​కు చెందిన 10 ఏళ్ల డేవిడ్​ సూ పరిస్థితి ఇదే. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు ఆ బాలుడు. ఎంత తిన్నా కడుపు నిండకపోవడం, ఆకలి తీరకపోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ‘ఇంకా తినాలి’ అంటుంది మెదడు. ఈ వ్యాధిని ప్రేడర్ విల్లీ సిండ్రోమ్ (PWS) అంటారు. ఇదొక జన్యుపరమైన సమస్య. క్రోమోజోమ్​ 15లోని కొన్ని జీన్స్​ సరిగా పనిచేయకపోవడమే ప్రేడర్ విల్లీ సిండ్రోమ్​కు కారణం.

చికిత్స లేని ఈ వ్యాధి భవిష్యత్​లో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనని డేవిడ్‌ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కుమారుడి ఆరోగ్యాన్ని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అతడి బరువును అదుపులో ఉంచడంపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. డేవిడ్ ఇష్టారీతిన తినకుండా చూసేందుకు వంట గదికి తాళం వేస్తున్నారు. ఎప్పుడు ఏం తినాలో స్పష్టమైన షెడ్యూల్ రూపొందించి, తమ కుమారుడు దానికి కట్టుబడి ఉండేలా చూస్తున్నారు.

పేగులకు చిల్లులు

ఈ వ్యాధి బారిన పడినవారు ముందు బరువు పెరుగుతారు. తర్వాత అనేక సమస్యలు వస్తాయి. నియంత్రణ లేకుండా అసాధారణ పరిమాణంలో ఆహారం తీసుకుంటే జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. ఇలా ఇప్పటికే కొందరు ప్రేడర్ విల్లీ బాధితుల పేగులకు చిల్లులు పడిన దాఖలాలూ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ టిష్యూ నెక్రోసిస్, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రోపరేసిస్ వంటి ఇబ్బందులు వస్తాయి.

మానసిక సమస్యలు

ఈ అసాధారణ ఆకలి వల్ల మానసిక సమస్యలూ తలెత్తుతాయి. తింటూనే ఉండాలన్న కోరికను నియంత్రించుకోవడం పెద్ద సవాలే. సరైన పర్యవేక్షణ లేకపోతే ప్రేడర్ విల్లీ సిండ్రోమ్ బాధితులు శరీరానికి హానిచేసే ప్రమాదకరమైన, పాడైపోయిన ఆహారాన్ని తీసుకునే ఆస్కారమూ ఉంది. బాధిత చిన్నారులు ఆహారాన్ని దాచి పెట్టుకోవడం, దొంగిలించడం, లేదా తిండి కోసం డబ్బులు దొంగతనం చేయడం వంటి పనులూ చేసే అవకాశముందని ఓ నివేదిక పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని