India- China: క్వాడ్‌లో భారత్‌ అందుకే చేరింది: పాంపియో

అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తన తాజా పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భారత్‌- చైనా మధ్య సంబంధాలను విశ్లేషిస్తూ తాము అధికారంలో ఉన్నప్పటి కొన్ని ఉదంతాలను ప్రస్తావించారు.

Updated : 26 Jan 2023 16:58 IST

వాషింగ్టన్‌: చైనా (China) దురహంకార చర్యలను నిలువరించడానికే క్వాడ్ (Quad) కూటమిలో భారత్‌ చేరిందని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో (Mike Pompeo) అన్నారు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అవలంబించే భారత్‌.. చైనా దుందుడుకు చర్యల కారణంగా తన వైఖరిని మార్చుకోవాల్సి వచ్చిందని తన తాజా పుస్తకం ‘నెవర్‌ గివ్‌ యాన్‌ ఇంచ్‌: ఫైటింగ్‌ ఫర్‌ ది అమెరికా ఐ లవ్‌’లో పాంపియో  పేర్కొన్నారు.

2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ (Galwan Clash)లోయలో భారత్‌ - చైనా మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇరుపక్షాల వైపు పలువురు సైనికులు మరణించారు. ఈ ఉదంతం తర్వాత ఉభయ దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తన కొత్త పుస్తకంలో భారత్‌ను సామ్యవాద పునాదులపై ఏర్పడిన దేశంగా పాంపియో అభివర్ణించారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఇటు అమెరికా, అటు రష్యా.. ఏ కూటమిలోనూ చేరకుండా భారత్‌ స్వతంత్ర వైఖరిని అవలంబించిందని పేర్కొన్నారు. ఇప్పటికీ దాదాపు అదే విధానాన్ని అనుసరిస్తోందని తెలిపారు.

2024లో పాంపియో అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండే అవకాశం ఉందని అమెరికాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆగడాలను నిలువరించడమే లక్ష్యంగా 2017లో క్వాడ్‌ కూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. అమెరికా, జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియా ఈ కూటమిలో సభ్య దేశాలు. భారత్‌ను ఈ కూటమిలోకి తీసుకురావడంలో ట్రంప్‌ నేతృత్వంలో అమెరికా ప్రభుత్వం విజయవంతమైందని పాంపియో అన్నారు. గల్వాన్‌ ఘర్షణ తర్వాత చైనాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు భారత్‌లో ఊపందుకున్నాయని పుస్తకంలో గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా పలు చైనా యాప్‌లను భారత్‌ నిషేధించినట్లు  పాంపియో పేర్కొన్నారు.

భారత్‌, చైనా మధ్య దూరం పెరగడానికి కారణమేంటన్న ప్రశ్న తనకు తరచూ ఎదురయ్యేదని పాంపియో ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. ‘‘అమెరికా- భారతదేశం మధ్య గతంలో ఎన్నడూ లేనంత దగ్గరి సంబంధాలను ఏర్పరచుకోవడానికి తాము అవకాశాలను సృష్టించుకుంటున్నాం అని ఆ ప్రశ్నవేసేవాళ్లకు సమాధానమిచ్చే వాళ్లం’’ అని పాంపియో పేర్కొన్నారు. భారత నాయకత్వం నుంచి కూడా తనకు  ఇదే తరహా సమాధానం తరచుగా వినిపించేదని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని