Kyiv: కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం.. ముగ్గురి మృతి

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా దాడులను తీవ్రం చేసింది. నేడు ఏకంగా 10 క్షిపణులను ప్రయోగించింది. మరో వైపు అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు మరో 300 మిలియన్‌ డాలర్ల సాయం అందనుంది.

Published : 01 Jun 2023 14:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాస్కోపై డ్రోన్‌ దాడులు జరిగిన మర్నాడే రష్యా(Russia) తీవ్రంగా స్పందించింది. కీవ్‌(Kyiv)పై గురువారం ఉదయం భారీ ఎత్తున క్షిపణి దాడులను చేసింది. దాదాపు 10కి పైగా క్షిపణులను నేటి తెల్లవారుజామున ప్రయోగించింది. ఈ దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొమ్మిదేళ్ల చిన్నారి కూడా ఉన్నారు.  మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత నెల కీవ్‌పై రష్యా 17 దాడులు చేసింది. వీటిల్లో చాలావరకు రాత్రి వేళ్లల్లో చోటు చేసుకొన్నవే. తాజా దాడులకు సంబంధించిన చిత్రాలను ఉక్రెయిన్‌ అధికారులు విడుదల చేశారు. యుద్ధం మొదలైన తర్వాత ఇటీవల కాలంలో రష్యా ఆత్మాహుతి డ్రోన్లు, క్రూజ్‌ క్షిపణులను ఎక్కువగా వాడుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌ ఎదురు దాడి చేస్తోందని అంచనావేయడంతో ఆ దేశ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులను చేస్తోంది.  

మరోవైపు బుధవారం ఉక్రెయిన్‌ జరిపిన షెల్లింగ్‌ కారణంగా లుహాన్స్క్‌ ప్రాంతంలో ఓ కోళ్లఫారం వద్ద ఐదుగురు చనిపోగా.. 19 మంది గాయపడినట్లు రష్యా పేర్కొంది. ఇక గురువారం తెల్లవారుజామున బెల్గొరోడ్‌ సమీపంలోని షెబ్‌కిబినో వద్ద ఉక్రెయిన్‌ జరిపిన దాడిలో ఇద్దరు గాయపడ్డారని ఆ ప్రాంత గవర్నర్‌ టెలిగ్రామ్‌ ఛానెల్‌లో పేర్కొన్నారు. రాత్రి వేళ దాదాపు గంటన్నరపాటు ఉక్రెయిన్‌ దళాలు షెల్లింగ్‌ చేసినట్లు పేర్కొన్నారు. 

ఉక్రెయిన్‌కు ప్యాకేజీపై మండిపడ్డ రష్యా..

అమెరికా(USA) నుంచి మరో 300 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీ ఉక్రెయిన్‌కు అందనుండటంపై రష్యా మండిపడింది. తమను వ్యూహాత్మకంగా ఓడించాలనే లక్ష్యంతో ఇలా చేస్తోందని పేర్కొన్నారు. ఇదే సమయంలో వారి మిత్రదేశాలకు ఆయుధాలు సరఫరా చేసి.. అనవసరమైన పనులను అమెరికా  ప్రోత్సహిస్తోందన్నారు. ఈ మేరకు అమెరికాలోని రష్యా రాయబారి ఆంటోనీ ఆంటనోవ్‌ వెల్లడించారు. బుధవారం బైడెన్‌ ప్రకటన వెలువడిన అనంతరం రష్యా ఈ విధంగా స్పందించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు