Fire Accident: 122 మంది ప్రయాణికులు ఉన్న విమానంలో మంటలు

చైనాలోని చాంగ్‌కింగ్‌ ఎయిర్‌పోర్టులోని విమానంలో అగ్నిప్రమాదం జరిగింది. టిబెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో మంటలు

Updated : 12 May 2022 09:54 IST

బీజింగ్‌: చైనాలో త్రుటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. చాంగ్‌కింగ్ విమానాశ్రయంలో టేకాఫ్‌ అవుతున్న విమానంలో అగ్నిప్రమాదం జరిగింది. అయితే, సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు.  

టిబెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నింగ్చి ప్రాంతానికి బయల్దేరుతుండగా ఈ ఘటన జరిగింది. విమానం టేకాఫ్‌ అవుతుండగా ఒక్కసారిగా దిశ మార్చుకొంది. విమానంలో అసాధారణ పరిస్థితులను గుర్తించిన సిబ్బంది వెంటనే టేకాఫ్‌ కాకుండా నిలిపివేశారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు 9 మంది సిబ్బంది ఉన్నారు. 

మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలతో హాహాకారాలు చేశారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారిని వెనుకవైపు ఉన్న అత్యవసర ద్వారం నుంచి నుంచి కిందకు పంపించేశారు. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంటల్లో విమానం కాలిపోతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

చైనాలో ఇటీవలే ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 12న కున్మింగ్‌ నుంచి గాంగ్‌ఝౌ వెళ్తోన్న విమానం గుయాంగ్జీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 132 మంది ప్రయాణికులు, సిబ్బంది మృత్యువాత పడ్డారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని