TOEFL: టోఫెల్‌ రాసేవారి సంఖ్యలో 59% పెరుగుదల

TOEFL: విద్యార్థుల్లో ఇంగ్లిష్ సామర్థ్యాన్ని అంచనా వేసే ఈ టోఫెల్‌ (TOEFL) స్కోరును ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు పైగా దాదాపు 12,000 యూనివర్శిటీలు అనుమతిస్తున్నాయి.

Updated : 17 Sep 2023 17:09 IST

దిల్లీ: విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లేవారి ఇంగ్లిష్‌ భాషా ప్రావీణ్యతను పరీక్షించేందుకు నిర్వహించే టోఫెల్‌ (టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఏ ఫారెన్‌ లాంగ్వేజ్‌- TOEFL) పరీక్ష రాసేవారి సంఖ్య భారత్‌లో గణనీయంగా పెరిగిందని తాజా ఓ అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై విధించిన ఆంక్షల్ని తొలగించిన తర్వాత సంఖ్య భారీగా పెరిగినట్లు పేర్కొంది. కరోనా ఆంక్షల్ని సడలించిన తర్వాత టోఫెల్‌ (TOEFL) రాసేవారి సంఖ్య 59 శాతం పెరిగినట్లు వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా 2022లో టోఫెల్‌ (TOEFL) రాసినవారిలో భారతీయుల వాటా 12.3 శాతంగా ఉన్నట్లు ఈ పరీక్షను నిర్వహించే ‘ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ETS)’ తెలిపింది. 2020తో పోలిస్తే 2021లో ఈ పరీక్ష రాసినవారి సంఖ్య 53 శాతం పెరిగింది. ఈ సంఖ్య వార్షిక ప్రాతిపదికన 2022లో 59 శాతం పుంజుకోవడం గమనార్హం. కేవలం అమెరికా, బ్రిటన్‌కు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు వెళ్లేందుకు కూడా అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారని ఈటీఎస్‌ ఇండియా మేనేజర్‌ సచిన్‌ జైన్‌ వెల్లడించారు. సింగపూర్‌, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, స్వీడన్‌ వంటి దేశాలకు వెళ్లేవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇటీవల కెనడా సైతం టోఫెల్‌ (TOEFL) పాసైన వారిని తీసుకునేదుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. భారత్‌లో వరుసగా దిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణె, హైదరాబాద్‌, గురుగ్రామ్‌, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌ వంటి నగరాల నుంచి ఈ పరీక్ష రాసేవారు అత్యధిక సంఖ్యలో ఉన్నట్లు వెల్లడించారు.

టోఫెల్‌ పరీక్ష సమయం కుదింపు..జులై నుంచి కీలక మార్పులు!

విద్యార్థుల్లో ఇంగ్లిష్ సామర్థ్యాన్ని అంచనా వేసే ఈ టోఫెల్‌ (TOEFL) స్కోరును ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు పైగా దాదాపు 12,000 యూనివర్శిటీలు అనుమతిస్తున్నాయి. విదేశీ విద్యలో భాగంగా ప్రపంచంలోనే ప్రసిద్ధ గమ్యస్థానాలుగా ఉన్న అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు యూకేలోని 98శాతానికి పైగా విశ్వవిద్యాలయాలు ఈ స్కోరును ప్రామాణికంగా తీసుకొని డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అమెరికాలోని న్యూయార్క్‌ యూనివర్శిటీ, కొలంబియా యూనివర్శిటీ, బోస్టన్‌ యూనివర్శిటీ, మసాచ్యుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వంటి ప్రముఖ వర్శిటీలు టోఫెల్‌ స్కోర్‌ను అనుమతిస్తున్నాయి. జులైలో ఈ పరీక్షల పలు కీలక మార్పులు చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని