Earthquake: తుర్కియే, సిరియాలో మృత్యుఘోష.. 5వేలకు పైనే మరణాలు!

ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసేలా తుర్కియే, సిరియాల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Updated : 07 Feb 2023 15:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తుర్కియే, సిరియాల్లో ప్రకృతి సృష్టించిన ఘోర విపత్తు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ భూప్రళయంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. వరుస భూకంపాల కారణంగా ఇప్పటివరకు ఈ రెండు దేశాల్లో 5వేల మందికి పైగా మృతిచెందినట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇంకోవైపు, ఈ భారీ భూకంపంలో మృతుల సంఖ్య మరింత భారీగా నమోదయ్యే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈ పెను విపత్తులో 20 వేల మందికి పైగా మరణించి ఉంటారని అంచనా వేసింది. 

తుర్కియేలో ఇప్పటివరకు దాదాపు 4వేల మందికి పైగా మృతి చెందినట్లు ఆ దేశ సహాయక సంస్థ వెల్లడించింది. అలాగే, సిరియాలో మరో 1500 మందికి పైనే ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా ఇరు దేశాల్లో 5వేల మందికి పైగా మరణించినట్లు తెలిపింది. ఒక్క తుర్కియేలోనే 20వేల మంది గాయపడగా.. వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు సిరియాలో మరో 2వేల మంది గాయపడ్డారు.

200 సార్లు ప్రకంపనలు..

ఆగ్నేయ తుర్కియే, ఉత్తర సిరియాల్లో సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. తుర్కియేలోని గాజియాన్‌తెప్‌ నగరానికి ఉత్తరాన 33 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం తర్వాత నుంచి ఇప్పటివరకు దాదాపు 200 సార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నట్లు పేర్కొన్నారు.

మా అమ్మ ఎక్కడ..?

శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. కొన్ని చోట్ల శిథిలాల అడుగు నుంచి ప్రజలు ఆర్తనాదాలు చేయడం.. వారి హాహాకారాలతో పరిస్థితులు దయనీయంగా మారాయి. హతయ్‌ ప్రావిన్స్‌లో కుప్పకూలిన ఓ బహుళ అంతస్తుల భవన శిథిలాల నుంచి ఓ ఏడేళ్ల బాలికను రెస్క్యూ సిబ్బంది రక్షించి బయటకు తీశారు. ఆ పాప బయటకు రాగానే ‘మ ఆ అమ్మ ఎక్కడ?’ అని అడగడం అక్కడున్న వారి హృదయాలను కలిచివేసింది.

ధ్వంసమైన జైలు.. పారిపోయిన ఉగ్రవాదులు

అటు అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాను తాజా భూకంపం మరింత వణికిస్తోంది. భూకంపం కారణంగా అక్కడ ఓ జైలు ధ్వంసమైంది. దీంతో ఆ జైల్లో ఉన్న ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు పారిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని