Earthquake: చేజారిన ఆ 72 గంటలు.. తుర్కియే, సిరియాల్లో భారీగా పెరగనున్న మృతులు..!

తుర్కియే(Turkey), సిరియా(Syria)లో బాధితులను కాపాడగలమన్న ఆశలు కరిగిపోతున్నాయి. భూకంప (Earthquake)సహాయక చర్యల్లో అత్యంత కీలకమైన 72 గంటలు నేటి ఉదయంతో పూర్తయ్యాయి. 

Updated : 09 Feb 2023 11:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

తుర్కియే (Turkey), సిరియా (Syria)లో భూకంప (Earthquake) బాధితులను కాపాడే అవకాశాలు వేగంగా కరిగిపోతున్నాయి. ఒక్క తుర్కియే(Turkey)లోనే భూకంపం కారణంగా 2,000 భవనాలు కూలినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతుంటే.. అనధికారికంగా ఆ దేశ 10 ప్రావిన్స్‌ల్లో కలిపి ధ్వంసమైన భవనాల సంఖ్య 6,000 పైనే ఉంటుందని అంచనా. వీటిల్లో ఆసుపత్రులు, పబ్లిక్‌ కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఇరు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య ఇప్పటికే 15,000 దాటేసింది. విమానాశ్రయాలు, కీలక నౌకాశ్రయాలు కూడా దెబ్బతినడంతో ప్రపంచ దేశాల సాయం అక్కడకు చేరడం కష్టతరంగా మారింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటానికి అత్యంత విలువైన 72 గంటల  కాలం కరిగిపోయింది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతుందనే భయాలు నెలకొన్నాయి.

తొలి 72 గంటలే ఎందుకు కీలకం..?

సాధారణంగా భూకంపం (Earthquake) నేరుగా మనిషి ప్రాణం తీయదు. కేవలం కూలిన భవనాలతోనే ప్రాణనష్టం ఉంటుంది. గత చరిత్రను పరిశీలిస్తే భూకంపాలు వచ్చిన సమయంలో 90శాతం మందిని తొలి మూడు రోజుల్లోనే రక్షించగలిగినట్లు గణాంకాలు చెబుతున్నాయని యూనివర్శిటీ కాలేజి లండన్‌కు చెందిన డిజాస్టర్‌ అండ్‌ హెల్త్‌ విభాగ ప్రొఫెసర్‌ ఇలాన్‌ కెల్మన్‌ చెబుతున్నారు. దీనికి తోడు వాతావరణం, సహాయక బృందాలు ఎంత వేగంగా చేరుకొన్నాయి, పరికరాలు ఎంత తొందరగా అందుబాటులోకి వచ్చాయి అనేది కీలకం. ఈ ప్రమాణాలు మొత్తం తుర్కియే(Turkey) - సిరియా(Syria)లో చాలా ప్రతికూలంగా ఉన్నాయి.  గురువారం ఉదయంతో 72 గంటల కాలం ముగిసిపోయింది.

హైపోథెర్మియా కలిగించేలా వాతావరణం..

ప్రస్తుతం భూకంపం (Earthquake) సంభవించిన ప్రదేశంలోని వాతావరణం కూడా సహాయక చర్యలకు ఏమాత్రం సహకరించడంలేదు. గడ్డకట్టుకుపోయే చలితో ఈ ప్రాంతంలో మంచుపడుతోంది. దీంతో హైపోథెర్మియా పరిస్థితులు నెలకొన్నాయి. శరీరంలో ఉష్ణం పుట్టే వేగం కంటే.. ఉష్ణం కోల్పోయే వేగం ఎక్కువగా ఉండే పరిస్థితిని హైపోథెర్మియా అంటారు. ఈ స్థితిలో శరీరం వేగంగా చల్లబడిపోతుంది. ఈ స్థితిలో శరీర ఉష్ణోగ్రత 95 ఫారన్‌ హీట్‌ కంటే తక్కువకు పడిపోతుంది. ఆరోగ్యవంతుడి శరీర ఉష్ణోగ్రత 98.8 ఫారన్‌ హీట్‌ ఉంటుంది. ఇటువంటి  వాతావరణ పరిస్థితుల్లో గాయాలతో జీవించాలంటే ఆహారం, నీరు కచ్చితంగా ఉండాలి. నీరు లేకపోవడంతో చాలా మంది భూకంప బాధితులు 3వ రోజు నుంచి  5వ రోజులోపు చనిపోతుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. 

స్థానికులు చేసే ప్రయత్నాలే కీలకం..

భూకంపం వచ్చిన తొలి 24 గంటల్లో స్థానికులు చేతులు, చిన్న చిన్న పరికరాలతో చేపట్టే సహాయక చర్యలు అత్యంత కీలకం. వీరే అత్యధిక మందిని కాపాడుతుంటారు. ప్రస్తుతం తుర్కియే(Turkey)-సిరియా(Syria)కు సాయం చేయడానికి చాలా దేశాలు ముందుకొచ్చాయి. కానీ, భూకంపం (Earthquake) వచ్చింది మారుమూల ప్రాంతాలు, యుద్ధక్షేత్రాలు కావడంతో సహాయక బృందాలు చేరుకొని పని మొదలు పెట్టడానికి ఎంతలేదన్నా 24గంటల సమయం పట్టింది. అప్పటికే కొన ఊపిరితో ఉన్న చాలా మందిని ప్రకృతి బలిగొంది. ఇక సిరియా సరిహద్దుల్లో యుద్ధక్షేత్రానికి ఇప్పటికీ సహాయక బృందాలను పూర్తిగా రానీయడం లేదు.

మెక్సికో డాగ్‌ స్క్వాడ్‌ చాలా ప్రత్యేకం..

శిథిలాల కింద బాధితులను గుర్తించడానికి చాలా విధానాలను అనుసరిస్తారు. వీటిల్లో వాసన పసిగట్టే జాగిలాలను వినియోగించడం కూడా ఓ విధానం. దీనిలో మెక్సికోకు చెందిన డాగ్‌స్క్వాడ్‌కు ప్రత్యేకమైన పేరుంది. ఈ బృందాల్లో బెల్జియన్‌ మాలినోయిస్‌, ఆస్ట్రేలియా షీప్‌డాగ్స్‌, లాబ్రడార్స్‌ జాతి శునకాలు ఉంటాయి. మెక్సికోలో కూడా భూకంపాలు (Earthquake) సర్వసాధారణం. దీంతో అక్కడ శిథిలాల కింద వారిని గుర్తించేలా కుక్కలకు శిక్షణ ఇస్తారు. 2017లో భూకంప బాధితులను గుర్తించడంలో ఈ శునకాలు కీలక పాత్ర పోషించాయి. అప్పట్లో ఫ్రిదా అనే జాగిలం ఏకంగా 43 మంది ప్రాణాలు కాపాడి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తాజాగా మెక్సికో, భారత్‌, క్రొయేషియా, చెక్‌రిపబ్లిక్‌, జర్మనీ, గ్రీస్‌, లిబియా, పోలాండ్‌, స్విట్జర్లాండ్‌, యూకే, అమెరికా దేశాలు తమ శునకాల బృందాలను పంపాయి.

ఇక శిథిలాల్లోని ఇరుకు సందుల్లో బాధితులను గుర్తించేందుకు రోబోలు, డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. ఒక్కసారి అక్కడ బాధితులను గుర్తించాక వారిని రక్షించేందుకు అవసరమైన క్రేన్లు ఇతర పరికరాలను మోహరిస్తారు. కొన్ని సందర్భాల్లో బాధితుల అవయవాలను కత్తిరించాల్సిన పరిస్థితులు కూడా నెలకొంటాయి.

ఒక్క ప్రాణం కాపాడటానికి 10 లక్షల డాలర్లు..

భూకంపంలో మృతుల సంఖ్య తగ్గించడానికి చర్యలు కొన్నేళ్ల ముందుగానే తీసుకోవాలి. ఆ ప్రదేశాల్లో భూకంపాలను తట్టుకొనే ప్రమాణాలతోనే నిర్మాణాలు చేపట్టాలి. ఇది ముందు జాగ్రత్త చర్య. ఇక భూకంపం వచ్చాక శిథిలాల కింద బాధితులను కాపాడేందుకు అత్యంత ఖరీదైన ఆపరేషన్లు చేపట్టాల్సి ఉంటుంది. తుర్కియే(Turkey)-సిరియా(Syria)ల్లో ఒక్కో మనిషిని కాపాడటానికి సగటున 10 లక్షల డాలర్లు ఖర్చు కావొచ్చని  డిజాస్టర్‌ అండ్‌ హెల్త్‌ విభాగ ప్రొఫెసర్‌ ఇలాన్‌ కెల్మన్‌ పేర్కొన్నారు. విపత్తులకు ముందే మేలుకొంటే ఈ పరిస్థితి రాదని ఆయన వివరించారు. శిథిలాల కింద చిక్కుకొని ప్రాథమిక అవసరాలు అందకపోతే వారు మనుగడ కోసం పోరాడే సమయం వేగంగా తగ్గిపోతుంది. ఈ క్రమంలో తొలి 72 గంటలే కీలకమని ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హామ్‌ ట్రెంట్‌ విశ్వవిద్యాలయ విపత్తు నిపుణుడు స్టీవెన్‌ గాడ్బీ కూడా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని