Cosmetic Surgeries: సౌందర్య చికిత్సతో ఫంగల్‌ మెనింజైటిస్‌.. కలవరపెడుతున్న మరణాలు

అమెరికాలో (USA) ఫంగల్‌ మెనింజైటిస్‌ (Fungal Meningitis) భారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సౌందర్య చికిత్సల కారణంగానే ముప్పును కొని తెచ్చుకున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

Published : 28 May 2023 21:44 IST

వాషింగ్టన్: అమెరికాలో ఫంగల్‌ మెనింజైటిస్‌ (Fungal Meningitis) మరణాలు కలవరపెడుతున్నాయి. సౌందర్య చికిత్సలే (Cosmetic Surgeries) దీనికి కారణమని భావిస్తున్న అమెరికా (USA), మెక్సికో (Mexico) దేశాల అధికారులు ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు (WHO) విజ్ఞప్తి చేసినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. తాజాగా అమెరికాలోని ఇద్దరు వ్యక్తులు ఫంగల్‌ మెనింజైటిస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ మెక్సికోలో లైపోసక్షన్‌ చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చికిత్స ద్వారా చర్మం దిగువున పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తారు. ఈ సమయంలో ఫంగస్‌ వాళ్ల శరీరంలోకి చొరబడుతుంది. కొన్నిరోజులకు కణాలను ఉబ్బిపోయేలా చేస్తుంది. ఫలితంగా మృతి చెందే ప్రమాదం ఉంటుంది. జనవరి నుంచి మే 13 మధ్యలో దాదాపు 200 మంది అమెరికన్లు ఈ చికిత్స కోసం మెక్సికో వెళ్లినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా వ్యాధుల నియంత్రణ కేంద్రం (CDC) హెచ్చరికలు జారీ చేసింది. వందలాది మంది ఈ ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటి వరకు ఫంగల్‌ మెనింజైటిస్‌ సోకినట్లుగా భావిస్తున్న 25 మందిని గుర్తించినట్లు పేర్కొంది. వీరందరికీ ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. మెక్సికోలో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్న రెండు క్లినిక్‌లను మూసివేయాలంటూ మెక్సికో సర్కారును కోరింది. దేశ వ్యాప్తంగా 25 రాష్ట్రాల్లోని ఆరోగ్యశాఖ అధికారులతో సమన్వయం చేస్తూ.. సీడీసీ తగిన సూచనలు చేస్తోంది. ఎవరిలోనైనా ఫంగల్‌ మెనింజైటిస్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గర్లోని ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాల్సిందిగా కోరింది. మెనింజైటిస్‌ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, మెడ పట్టేయడం, వాంతులు, కాంతి వైపు చూడలేకపోవడం, స్ఫృహ కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, ఇది అంటువ్యాధి కాదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సీడీసీ పేర్కొంది. కానీ, లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని