Boris Johnson: మరింత సంక్షోభంలో బోరిస్‌ సర్కారు.. మరో ఇద్దరు మంత్రుల రాజీనామా

బ్రిటన్‌లో బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వం మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రధాని జాన్సన్‌పై విశ్వాసం కోల్పోయామని చెబుతూ నిన్న ఇద్దరు సీనియర్‌ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే

Updated : 06 Jul 2022 17:35 IST

లండన్‌: బ్రిటన్‌లో బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వం మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రధాని జాన్సన్‌పై విశ్వాసం కోల్పోయామని చెబుతూ నిన్న ఇద్దరు సీనియర్‌ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు మంత్రులు కూడా వైదొలిగారు.

శిశు, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విల్ క్విన్‌ బుధవారం ఉదయం ట్విటర్‌ వేదికగా తన రాజీనామాను ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పదవి నుంచి వైదొలగడం కంటే తనకు మరో అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే రవాణా శాఖ సహాయ మంత్రి లారా ట్రాట్‌ కూడా తన పదవి నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. బోరిస్‌ ప్రభుత్వం మీద తనకు విశ్వాసం పోయిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లారా తెలిపారు. ఇప్పటికే బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌, ఆరోగ్య మంత్రి సాజిద్‌ జావిద్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో అధికార నివాసంలో పార్టీ చేసుకున్నందుకు గానూ ఆయనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ప్రభుత్వ డిప్యూటీ చీఫ్‌ విప్‌ క్రిస్‌ పించర్‌ వివాదం కూడా బోరిస్ మెడకు చుట్టుకుంది. 2019లో ప్రధాని జాన్సన్‌... క్రిస్‌ పించర్‌ను ప్రభుత్వ డిప్యూటీ చీఫ్‌ విప్‌గా నియమించారు. అప్పటికే అతని నడవడికకు సంబంధించి పలు ఆరోపణలున్నాయి. ఆ విషయాన్ని ప్రభుత్వాధికారులు చెప్పినా జాన్సన్‌ పట్టించుకోకుండా క్రిస్‌ పించర్‌ను కీలకమైన పదవిలో కూర్చోబెట్టారు. ఇటీవల ఒక క్లబ్‌లో తాగిన మత్తులో క్రిస్‌ పించర్‌ ఇద్దరు పురుషుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారి తీసింది.

అయితే అతను ఇలాంటి వాడని తనకు తెలియదని ప్రధాని బోరిస్‌ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ, పించర్‌ గురించి తాము ముందే నివేదించామని మాజీ అధికారి ఒకరు చెప్పడంతో బోరిస్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. దీంతో బోరిస్‌పై తమకు విశ్వాసం లేదంటూ రిషి సునాక్‌, జావిద్‌ నిన్న మంత్రి పదవుల నుంచి తప్పుకొన్నారు. ప్రధాని కూడా వైదొలగాలని డిమాండ్‌ చేశారు. తాజాగా మరో ఇద్దరు మంత్రులు కూడా రాజీనామా చేయడంతో బోరిస్‌ ప్రభుత్వం మరింత సంక్షోభంలో కూరుకుపోయినట్లయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని