UK: భారత్‌తో సరికొత్త వాణిజ్య ఒప్పందం : రిషి సునాక్‌

బ్రిటన్‌ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తొలిసారి విదేశాంగ విధానంపై రిషి సునాక్‌ మాట్లాడారు. ఆయన చైనా విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 29 Nov 2022 11:42 IST

ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి తమ దేశం కట్టుబడి ఉందని యూకే ప్రధాని రిషి సునాక్‌ తెలిపారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంతో సన్నిహిత సంబంధాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని తమ నిర్ణయం ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఆయన సోమవారం రాత్రి లండన్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తన విదేశాంగ విధానాన్ని వివరించారు. స్వేచ్ఛా, పారదర్శకతల్లో బ్రిటన్‌ విధానాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి రాక ముందు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టానని సునాక్‌ వివరించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం తప్పనిసరన్నారు. 

2050 చివరి నాటికి ఈ ప్రాంతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో సగం విలువ కలిగి ఉంటుందని.. అదే ఐరోపా-ఉత్తర అమెరికా కలిపి కేవలం నాలుగో వంతు మాత్రమేనని సునాక్‌ చెప్పారు. అందుకే యూకే ట్రాన్స్‌ పసిఫిక్‌ ఒప్పందం, సీపీటీపీపీల్లో చేరిందని.. భారత్‌, ఇండోనేషియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను చేసుకొనే అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. ‘‘మా తాతలు భారత్‌ నుంచి తూర్పు ఆఫ్రికా మీదుగా ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. ఇటీవల కాలంలో హాంకాంగ్‌, అఫ్గానిస్థాన్‌, ఉక్రెయిన్‌ల నుంచి పలువురికి దేశంలో స్థానం కల్పించాం. ప్రజాస్వామ్య విలువలకు రక్షణగా మన దేశం నిలబడుతుంది’’ అని పేర్కొన్నారు. 

చైనా సంబంధాల్లో స్వర్ణయుగం ముగిసింది..

చైనాతో యూకే సంబంధాలపై రిషి సునాక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంతో సంబంధాల విషయంలో స్వర్ణయుగం ముగిసిందని అభివర్ణించారు. అలాగని ప్రచ్ఛన్న యుద్ధ శైలిలో ఉండకూడదని.. ఆధునిక ప్రపంచంలో చైనా పాత్రను తక్కువ చేయలేమని పేర్కొన్నారు. చైనా ఆందోళనకు వ్యతిరేకంగా అణచివేత వైఖరిని ఎంచుకొందన్నారు. ఈ క్రమంలో బీబీసీ జర్నలిస్టుపై కూడా దాడి చేసిందని పేర్కొన్నారు. బ్రిటన్‌ విలువలు, ప్రయోజనాలకు చైనాను వ్యూహాత్మక సవాలుగా తాను గుర్తిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని