Ukraine Crisis: రష్యా చేతికి మేరియుపొల్!
ఉక్రెయిన్పై రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 7 వారాల పోరాటం తర్వాత- ఉక్రెయిన్ ప్రధాన నగరాల్లో ఒకటైన మేరియుపొల్పై పట్టు సాధించినట్లు రష్యా ప్రకటించింది. అక్కడ తమ బలగాలు ఇంకా పోరాడుతున్నాయని
దాదాపు 7 వారాల తర్వాత కీలక నగరం స్వాధీనం?
అక్కడ మిగిలిన ఉక్రెయిన్ సేనలు లొంగిపోతే ప్రాణభిక్ష ప్రసాదిస్తామని ప్రకటన
ఇంకా పోరాడుతున్నామన్న జెలెన్స్కీ సర్కారు
కీవ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 7 వారాల పోరాటం తర్వాత- ఉక్రెయిన్ ప్రధాన నగరాల్లో ఒకటైన మేరియుపొల్పై పట్టు సాధించినట్లు రష్యా ప్రకటించింది. అక్కడ తమ బలగాలు ఇంకా పోరాడుతున్నాయని ఉక్రెయిన్ ప్రకటించినప్పటికీ... పుతిన్ సేనలకు నగరం చిక్కినట్లేనని తెలుస్తోంది. అదే వాస్తవమైతే.. ఫిబ్రవరి 24వ తేదీన యుద్ధం ప్రారంభించిన తర్వాత- ఉక్రెయిన్ నగరం ఒకదానిని రష్యా స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్ తరఫున ఇంకా పోరాడుతున్న కొద్దిమందిని మేరియుపొల్లోని అజోవ్స్తల్ ఉక్కు కర్మాగారంలో బంధించినట్లు రష్యా తెలిపింది. తూర్పు భాగంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించడానికి వీలుపడేలా ముందుగా ఈ దక్షిణ నగరాన్ని హస్తగతం చేసుకోవాలని గత ఏడు వారాలుగా రష్యా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. మేరియుపొల్కు ‘స్వేచ్ఛ’ ప్రసాదించే క్రమంలో 1,464 మంది ఉక్రెయిన్ సైనికులు ఇప్పటికే లొంగిపోయారని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ముఖ్య అధికార ప్రతినిధి తెలిపారు. దాదాపు నగరమంతటినీ గుప్పిట పట్టామనీ, మిగిలినవారు ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని రష్యా ప్రకటించింది. వారందరినీ జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలుగా పరిగణించి సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని రష్యా శనివారం రాత్రి నుంచి ప్రతి అరగంటకోసారి ఉక్రెయిన్ వర్గాలకు చెబుతోంది.
లొంగుబాటు ప్రసక్తే లేదు
రష్యా ప్రతిపాదనను ఉక్రెయిన్ తోసిపుచ్చింది. మేరియుపొల్ను రక్షించుకునేందుకు సైన్యం ప్రయత్నిస్తోందని, లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. అక్కడ ఉన్నవారిలో ప్రతిఒక్కరినీ నాశనం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. అజోవ్ సముద్ర తీరాన ఉన్న నగరాన్ని కాపాడుకునేందుకు మరికొన్ని భారీ ఆయుధాలు ఇవ్వాల్సిందిగా ప్రపంచదేశాలను అభ్యర్థించారు. ఆ నగరంలో చిక్కుకున్న వేలమంది ప్రజల్ని రక్షించే విషయమై బ్రిటన్, స్వీడన్ నేతలతో చర్చించినట్లు తెలిపారు. యుద్ధం, లేదా దౌత్యం ద్వారా ఆ నగర భవితవ్యం తేలుతుందన్నారు.
మసీదు నుంచి బందీల విడుదల
మేరియుపొల్లో ఒక మసీదులో బందీలుగా ఉన్నవారిని తమ సైనికులు విడిపించారని, 29 మంది ఉగ్రవాదుల్ని హతమార్చారని రష్యా రక్షణశాఖ తెలిపింది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దోగన్ అభ్యర్థన మేరకు ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించింది.
విరుచుకుపడ్డ క్షిపణులు
కీవ్, లివివ్, ఖర్కివ్ సహా వివిధ ప్రాంతాలపై ఆదివారం రాకెట్లతో రష్యా క్షిపణి దాడులు యథావిధిగా కొనసాగాయి. తూర్పు ప్రాంతాల్లో ఉక్రెయిన్ గగనతల రక్షణ రాడార్లను, పలుచోట్ల ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది. ఖర్కివ్లో క్షిపణి దాడిలో కనీసం ఐదుగురు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
యుద్ధానికి తెరపడాలి: పోప్
ఉక్రెయిన్లో శాంతి నెలకొనాలని పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం ఈస్టర్ ప్రార్థనల సందర్భంగా ఆకాంక్షించారు. ‘క్రూరమైన, అర్థరహితమైన’ యుద్ధానికి తెరపడాలన్నారు. రష్యా పతాకం ఉన్న నౌకలు నల్ల సముద్రంలోని రేవుల ద్వారా అడుగుపెట్టకుండా నిషేధిస్తున్నట్లు బల్గేరియా తెలిపింది.
ఈ నగరం ఎందుకు కీలకం?
రష్యా పట్టు సాధించామని చెబుతున్న ఉక్రెయిన్లోని మేరియుపొల్ నగరం వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రాంతం. తూర్పు అజోవ్ సముద్ర తీరంలోని ప్రధాన ఓడరేవు పట్టణమిది. దీనిపై పట్టు సాధించడం రష్యాకు ఎందుకు కీలకమంటే...
* రష్యా స్వతంత్ర ప్రాంతంగా గుర్తించిన ఉక్రెయిన్లోని డాన్బాస్కు, 2014లో పుతిన్ ఆక్రమించిన క్రిమియాకు మధ్యలో మేరియుపొల్ ఉంది. అంటే ఇక నుంచి క్రిమియాకు, డాన్ బాస్ ప్రాంతానికి మధ్య భూమార్గంలో రవాణాకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. క్రిమియా నుంచి పోరాడుతున్న రష్యా సైన్యానికి, లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రాంతాల్లో పోరాడుతున్న దళాలకు సమన్వయం మరింత పెరుగుతుంది.
* రానున్న రోజుల్లో అమెరికా, నాటో సరఫరా చేస్తున్న ఆయుధాలతో డాన్బాస్ ప్రాంతాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు ఉక్రెయిన్ భీకర దాడులు జరిపే అవకాశం ఉంది. అదే జరిగితే ఉక్రెయిన్ దళాలపై పైచేయి సాధించటానికి అజోవ్ సముద్రతీరంపై నియంత్రణ రష్యాకు కీలకం. ఇప్పుడది సాధించడంతో ఆయుధాల సరఫరాకు సైన్యం కదలికలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు.
* మేరియుపొల్ విజయం కేవలం అజోవ్ సముద్ర తీర ప్రాంతానికే పరిమితం కాదు. ఇది త్వరలో నల్ల సముద్రంపై రష్యా సేనలు పట్టు సాధించటానికీ తోడ్పడనుంది.
* ఈ పట్టణాన్ని కోల్పోవడం ఆర్థికంగా ఉక్రెయిన్కు దెబ్బే. ఉక్కు, బొగ్గు, మొక్కజొన్న ఎగుమతులకు ఈ నగరం కీలక కేంద్రం. తమ దేశానికి మేరియుపొల్ ఒక రక్షా కవచమని ఉక్రెయిన్ రక్షణశాఖ ఉప మంత్రి హన్నా మల్యార్ కూడా ఇటీవల తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత