యుద్ధ ఖైదీలను నగ్నంగా మార్చి చిత్రహింసలు.. వెలుగులోకి ఉక్రెయిన్‌, రష్యా దారుణాలు

యుద్ధ ఖైదీల పట్ల ఉక్రెయిన్‌, రష్యా.. రెండు దేశాలు అమానవీయంగా వ్యవహరించాయని ఐరాస మానవహక్కుల కార్యాలయం తాజాగా బయటపెట్టింది. వారిని చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిపింది.

Published : 16 Nov 2022 01:46 IST

జెనీవా: ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న యుద్ధం మాటున ఎన్నో అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. యుద్ధ ఖైదీలపై రష్యా సైన్యం అమానవీయంగా వ్యవహరిస్తోందని గతంలో అనేకసార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఉక్రెయిన్‌ చెరలో ఉన్న యుద్ధ ఖైదీలు కూడా ఇలాంటి దారుణమైన చిత్రహింసలే ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కార్యాలయం తాజాగా బయటపెట్టింది.

దాదాపు తొమ్మిది నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇరు దేశాలు అనేక మందిని యుద్ధ ఖైదీలుగా అదుపులోకి తీసుకుని డిటెన్షన్‌ కేంద్రాల్లో ఉంచాయి. అయితే ఈ కేంద్రాల్లో రెండు దేశాలు ఖైదీలను చిత్రహింసలకు గురిచేశాయని ఐరాస దర్యాప్తులో వెల్లడైంది. ఖైదీలను ఎలక్ట్రిక్‌ షాక్‌ పెట్టడం, వారిని నగ్నంగా మార్చి కొట్టడం వంటివి జరిగినట్లు తెలిసింది. ఉక్రెయిన్‌ కేంద్రంగా పనిచేసిన ఐరాస బృందం జరిపిన దర్యాప్తులో ఈ దురాగతాలు వెలుగులోకి వచ్చాయి.

ఇరువైపులా 100 మందికి పైగా యుద్ధ ఖైదీలతో ఇంటర్వ్యూలు జరిపిన అనంతరం ఐరాస మానవహక్కుల కార్యాలయం ఈ విషయాలను బయటపెట్టింది. రష్యాకు చెందిన డిటెన్షన్‌ కేంద్రాల్లో ఉన్న ఉక్రెయిన్‌ ఖైదీలను ఇంటర్వ్యూ చేసేందుకు క్రెమ్లిన్‌ అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఖైదీలు విడుదలైన తర్వాత ఈ బృందం వారిని ఇంటర్వ్యూ చేసింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అనేక మంది కీవ్‌ సైనికులను మాస్కో బందీలుగా తీసుకుంది. ఈ క్రమంలోనే వారిని చిత్రహింసలకు గురిచేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, వాటిని రష్యా ఖండించింది. యుద్ధ ఖైదీలను చిత్రహింసలు పెట్టడమే యుద్ధ నేరం కిందకే వస్తుందని, దీనిపై దర్యాప్తు జరిపి న్యాయపరమైన చర్యలు చేపడుతామని అప్పట్లో ఉక్రెయిన్‌ వెల్లడించింది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్‌ చెరలో ఉన్న రష్యా సైన్యంపైనా దారుణాలు జరిగినట్లు తేలడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని