UN: ‘పాత్రికేయుల్ని జైలుపాలు చేయొద్దు’.. జుబైర్ అరెస్టుపై స్పందించిన ఐరాస

ప్రముఖ జర్నలిస్టు, ఆల్ట్ న్యూస్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాకుడు మొహమ్మద్‌ జుబైర్‌ అరెస్టుపై అంతర్జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది.

Published : 30 Jun 2022 01:48 IST

న్యూయార్క్‌: ప్రముఖ జర్నలిస్టు, ఆల్ట్ న్యూస్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాకుడు మొహమ్మద్‌ జుబైర్‌ అరెస్టుపై అంతర్జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. పాత్రికేయులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వాతావరణం ఉండాలని ఐక్యరాజ్య సమితి(UN) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వెల్లడించారు. వారు వ్యక్తపరిచిన విషయాలపై వారిని జైలు పాలు చేయొద్దని సూచించారు.

‘ఈ ప్రపంచంలో ఏ ప్రదేశంలో అయినా ప్రజలు తమ భావాలను వ్యక్తపరిచేందుకు తగిన వాతావరణం ఉండాలన్నది నా అభిప్రాయం. వారి రాతలు, ట్వీట్లు, మాటలపై పాత్రికేయుల్ని జైల్లో పెట్టకూడదు. వారికి బెదిరింపులు లేని వాతావరణం ఉండాలి. ఈ మాట ఈ గదితో సహా ప్రపంచంలో ఎక్కడైనా వర్తిస్తుంది’ అని గుటెర్రస్ ప్రతినిధి స్టీఫెన్ దుజార్రిక్ అన్నారు. 

జుబైర్ అరెస్టును లాభాపేక్ష లేని, ప్రభుత్వేతర స్వతంత్ర సంస్థ కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్‌(సీపీఏ) తీవ్రంగా ఖండించింది. ‘ఈ అరెస్టు.. భారత్‌ పత్రికా స్వేచ్ఛ కనిష్ఠ స్థాయిని సూచిస్తోంది. మతపరమైన సమస్యలపై రిపోర్టింగ్‌ చేసే సభ్యులకు ప్రభుత్వం సురక్షితంగా లేని, ప్రతికూల వాతావారణాన్ని సృష్టించింది’ అంటూ విమర్శించింది. జుబైర్‌ గతంలో చేసిన ఓ ట్వీట్‌ ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న అభియోగాలపై ఆయన్ను ఇటీవల దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్విటర్‌ వినియోగదారుడొకరు చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన రిమాండ్‌లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని