UN: ఐరాస ఉగ్ర ఆంక్షల విధానాలపై మండిపడ్డ భారత్‌..!

ఐరాసలోని భద్రతా మండలిలో ఉగ్ర ఆంక్షల కమిటీ తీరుపై భారత్‌ మండిపడింది. ఉగ్రవాదాన్ని అందరూ ఒక్క స్వరంలో వ్యతిరేకించాలని పేర్కొంది. ఐరాసలోని ఆంక్షల విధానంపై నమ్మకం ఎన్నడూ లేనంతగా పతనమైందని విమర్శించింది.

Published : 11 Aug 2022 01:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐరాసలోని భద్రతా మండలిలో ఉగ్ర ఆంక్షల కమిటీ తీరుపై భారత్‌ మండిపడింది. ఉగ్రవాదాన్ని అందరూ ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేకించాలని పేర్కొంది. ఐరాసలోని ఆంక్షల విధానాలపై నమ్మకం ఎన్నడూ లేనంతగా పతనమైందని విమర్శించింది. చైనా, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ల విషయంలో సంస్థ పనితీరును భారత్‌ పరోక్షంగా తప్పుపట్టింది. ఐరాస సెక్రటేరియట్‌ ఉగ్రవాదం అంశంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించింది. 

‘ఉగ్రవాద చర్యలతో అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పు’ అనే అంశంపై జరిగిన చర్చలో ఐరాసలో భారత దౌత్యవేత్త రుచిరా కాంబోజ్‌ ప్రసంగించారు. ఉగ్రజాబితాలపై పట్టు సాధించడం కోసం చైనా చేసే ప్రయత్నాలను, ఉగ్రవాదాన్ని కీర్తించే పాకిస్థాన్‌, ఉగ్ర సంస్థలకు ఆశ్రయం కల్పించే అఫ్గానిస్థాన్‌ను పరోక్షంగా ప్రస్తావించారు. ప్రపంచలోనే అత్యంత క్రూరమైన  ఉగ్రవాదుల వివరాలను ఆధారాలతో సహా ఇచ్చినా.. ఆ పేర్లను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చకుండా ఆపడం బాధాకరమని భారత్‌ పేర్కొంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు భద్రతా మండలి ఆంక్షల విధానాలపై నమ్మకాన్ని దిగజారుస్తాయని పేర్కొంది. 

ఉగ్రవాదంపై ఐరాస సెక్రటరీ జనరల్‌ నివేదికను భారత్‌ తప్పుపట్టింది. మధ్య, దక్షిణాసియాలో కేవలం ఐఎస్‌ఐఎల్‌-కె ఉగ్రసంస్థను మాత్రమే ఆ నివేదికలో ప్రస్తావించడంపై రుచిరా మండిపడ్డారు. ఈ ప్రాంతంలో చాలా గ్రూపులు ఉన్నా.. పట్టించుకోలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్‌ను లక్ష్యంగా చేసుకొనే గ్రూపులను ప్రస్తావించలేదన్నారు. కేవలం ఎంపిక చేసిన సమాచారాన్నే ఈ నివేదిక కోసం తీసుకున్నారని ఆరోపించారు. భారత ఉపఖండంలో లష్కరే-జైషే మధ్య ఉన్న బంధం ఎంత ప్రమాదకరంగా మారిందో వంటి అంశాలను భారత్‌ ప్రస్తావించింది. 

గతంలో భారత్, అమెరికాలు కలిసి పాక్‌ ఉగ్రవాది అబ్దుల్‌ రహ్మాన్‌ మక్కీపేరు ఐరాస ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని ప్రతిపాదించాయి. కానీ, చైనా ఆ ప్రతిపాదనను చివరి నిమిషంలో అడ్డుకుంది. అంతకు ముందు కూడా భారత్ ప్రతిపాదించిన ఉగ్రవాదులు, సంస్థల పేర్లను చైనా అడ్డుకొంటూ వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు