UNESCO: భారత్‌కు అరుదైన గౌరవం.. యునెస్కో వెబ్‌సైట్‌లో హిందీకి చోటు

ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వారసత్వ కేంద్రం (వరల్డ్​ హెరిటేజ్​ సెంటర్)​ వెబ్​సైట్​లో......

Updated : 12 Jan 2022 15:02 IST

పారిస్‌: ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వారసత్వ కేంద్రం (వరల్డ్​ హెరిటేజ్​ సెంటర్)​ వెబ్​సైట్​లో.. భారత్​కు చెందిన వారసత్వ కట్టడాల వివరాలను ఇకపై హిందీలోనూ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. యునెస్కో వరల్డ్​ హెరిటేజ్​ సెంటర్​ (డబ్ల్యూహెచ్​సీ) డైరెక్టర్​.. ఈమేరకు యునెస్కో భారత శాశ్వత ప్రతినిధి విశాల్‌ శర్మకు తెలియజేశారు. దీనిపై విశాల్‌ హర్షం వ్యక్తం చేస్తూ ఇదో చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు.

2022, జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవ వేడుకలను విశాల్​ శర్మ వర్చువల్​గా నిర్వహించారు. భారత్​కు స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో హిందీ సాధించిన కీలక పురోగతి, దాని ప్రాముఖ్యతతోపాటు పలు అంశాలను తెలియజేశారు. ఈ సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి హాజరై ప్రసంగించారు. హిందీ ప్రాముఖ్యతను కొనియాడారు.

మరోవైపు.. ప్రపంచ హిందీ దినోత్సవ వేడుకలకు విద్యా, సామాజిక, సాంస్కృతిక, సమాచార, ప్రసారాల విభాగలకు చెందిన ప్రతినిధులు వీడియో సందేశాలు పంపారు. అలాగే.. అంగోలా, బంగ్లాదేశ్​, బ్రెజిల్​, ఈక్వెడార్​, ఫ్రాన్స్​ గ్రీస్​, ఇరాన్​, జపాన్​, మంగోలియా, పాలస్తినా, కొరియా, రష్యా, శ్రీలంక, వియత్నాంలకు చెందిన యునెస్కోలో శాశ్వత ప్రతినిధులు వీడియో సందేశాలు పంపించి.. హిందీ ప్రాముఖ్యతపై ప్రసంగించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని